Bandi Sanjay
Bandi Sanjay

Bandi Sanjay: గన్నేరువరం నుంచి బేగంపేట వరకు డబుల్ రోడ్డు

రూ.32 కోట్లతో నిర్మాణ పనులు షురూ
గన్నేరువరంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ శంకుస్థాపన
భారీగా తరలివచ్చిన స్థానిక ప్రజలు
బండి సంజయ్‌తోపాటు ఎమ్మెల్యే సత్యనారాయణకు గజమాలతో సత్కారం
పూలు చల్లి, టపాసులు పేల్చి కేంద్ర మంత్రి, ఎమ్మెల్యేకు ఘన స్వాగతం
Bandi Sanjay: గన్నేరువరం ప్రజల చిరకాల వాంఛ నెరవేరబోతోంది. గన్నేరువరం నుంచి మైలారం, ఖాసింపేట్, వడ్లూరు నుంచి బేగంపేట వరకు డబుల్ రోడ్డు నిర్మాణ పనులు షురు అయ్యాయి. రూ.32 కోట్ల వ్యయంతో నిర్మించనున్న డబుల్ రోడ్డు నిర్మాణ పనులకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి శుక్రవారం శంకుస్థాపన చేశారు. తొలుత బండి సంజయ్ గుండ్లపల్లి చౌరస్తా వద్దకు రాగానే స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తన కార్యకర్తలతో ఎదురేగి స్వాగతం పలికారు. ఇద్దరూ కలిసి గన్నేరువరం చేరుకోగానే స్థానిక ప్రజలు గజమాలతో ఇరువురిని సత్కరించారు.

అదే సమయంలో బీజేపీ కార్యకర్తలు, స్థానికులు సంజయ్ పై పూల వర్షం కురిపించారు. బండి సంజయ్ రాకను స్వాగతిస్తూ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతోపాటు ఆయన రాగానే బాణాసంచా పేల్చి సంబురాలు చేసుకున్నారు. స్థానిక ప్రజల కోరిక మేరకు ఓపెన్ టాప్ జీపుపై ఎక్కిన బండి సంజయ్, కవ్వంపల్లి సత్యనారాయణ ప్రజలకు అభివాదం చేస్తూ దాదాపు కిలోమీటర్ మేరకు ముందుకు సాగారు. అనంతరం గన్నేరువరం పోలీస్ స్టేషన్ వద్ద గన్నేరువరం నుంచి బేగంపేట వరకు డబుల్ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. భారీగా తరలివచ్చిన స్థానిక ప్రజలు బండి సంజయ్‌తో సెల్ఫీ దిగేందుకు పోటీ పడ్డారు. అందరికీ అభివాదం చేస్తూ, సెల్ఫీలు దిగుతూ బండి సంజయ్ ముందుకుసాగారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *