Ethanol industry: నిర్మల్, డిసెంబర్ 10 (మన బలగం): నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం గుండంపెల్లి, దిలావర్పూర్ గ్రామాల మధ్యలో నిర్మిస్తున్న ఇథనాల్ పరిశ్రమ విషయంలో కొత్తగా ఎలాంటి కేసులు నమోదు చేయలేదని జిల్లా ఎస్పీ జానకి షర్మిల స్పష్టం చేసారు. గత నెలలో ఆందోళన జరిగిన సమయంలో నమోదు చేసిన కేసులపై దుష్ప్రచారం చేస్తున్నారని ఎస్పీ అన్నారు. రెండు రోజుల నుంచి సామాజిక, ఇతరత్రా మాధ్యమాలలో ప్రచారమవుతున్నట్లు దిలావర్పూర్, గుండంపల్లి గ్రామాల రైతులపై కొత్తగా ఎలాంటి కేసులు పెట్టలేదని వెల్లడించారు. ఆందోళనల నేపథ్యంలో చట్ట ప్రకారం అప్పుడు నమోదైన కేసులే ఉన్నాయని, వాటికి సంబంధించి అప్పుడే నోటీసులు ఇచ్చామని వివరించారు. తాజాగా ఆయా గ్రామస్తులపై ఎలాంటి కేసులను నమోదు చేయలేదని తెలిపారు. అప్పుడు కూడా ఎవరి మీద 307 వంటి తీవ్రమైన సెక్షన్ల కేసులు పెట్టలేదని స్పష్టం చేశారు. ఈ మధ్య కొంతమంది పనిగట్టుకొని ఈ విషయంలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని, ఆయా గ్రామస్తులు, రైతులను భయాందోళనలకు గురిచేసేలా పుకార్లు సృష్టిస్తున్నారన్నారు. ప్రజలు ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని, రైతులు, యువకులు, మహిళలు ఎవరు అసత్య ప్రచారాలను నమ్మవద్దని, అధైర్య పడొద్దని కోరారు. కొన్ని సంఘ విద్రోహ శక్తులు ప్రజల్లో అశాంతి నెలకొల్పడం కోసం అసత్య ప్రచారాలను పత్రికల్లో, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నట్లు తెలుస్తోందని, వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరం సమష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉందని కోరారు.