teacher: ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని ఆనంద్పూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు పాఠశాలలోనే నిద్రించాడు. ఈ చర్యపై మిగతా ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు సదరు టీచర్ను అభినందించి ప్రశంసలు కురిపించారు. ‘మీరు తీసుకున్న సాహసోపేత నిర్ణయంతో విద్యార్థుల్లో నెలకొన్న భయం పోయిందని, విద్యార్థులు మళ్లీ చక్కగా పాఠశాలకు రాగలుగుతున్నారని, వారి అనుమానం సైతం నివృత్తి అయ్యింది.’ అని పొగడ్తలతో ముంచెత్తారు.
అసలు ఏం జరిగింది. ఉపాధ్యాయుడు పాఠశాలలో పడుకుంటే చర్యలు తీసుకోవాల్సింది పోయి ప్రశంసించడం ఏంటని ఆశ్చర్యపోకండి. నిజంగానే ఆ టీచర్ సాహసం చేశాడనే చెప్పాలి. విద్యార్థుల్లో నెలకొన్న దెయ్యం భయాన్ని పోగొట్టాడు. పాఠశాలలో దెయ్యం ఉందన్న కారణంతో విద్యార్థులు బడికి రావడం మానేస్తున్నారు. ఈ క్రమంలో విద్యార్థుల్లో నెలకొన్న భయాన్ని తొలగించాలని అదే పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు రవీందర్ నిశ్చయించుకున్నారు.
గత ఏడాది కేమ శ్రావణ్ అనే నాలుగో తరగతి విద్యార్థి దెయ్యం ఉందని భయంతో పాఠశాలకు రావడం మానేశాడు. ప్రైవేటు పాఠశాలకు వెళ్తున్నాడు. దీంతో మిగతా విద్యార్థుల్లోనూ భయం నాటుకుపోయింది. జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి, అదే పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న నూతల రవీందర్ విద్యార్థుల్లో నెలకొన్న భయాన్ని పొగొట్టాలని నిశ్చయించుకున్నాడు. అమావాస్య రోజున రాత్రి పాఠశాలలో ఒంటరిగా పడుకున్నాడు. ఉదయం ఉపాధ్యాయుడు క్షేమంగా ఉండడంతో విద్యార్థుల్లో నెలకొన్న భయం పోయింది. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నూతల రవీందర్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు రవీందర్ను అభినందించారు. ఈ ఘటన ఈ నెల 2వ తేదీన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.