Bandi Sanjay: సిరిసిల్లలో పవర్ లూం క్లస్టర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ బుధవారం కేంద్ర జౌళిశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ను కోరారు. దీంతోపాటు ముడిసరుకు డిపో (యార్న్ డిపో)ను ఏర్పాటు చేయాలని విన్నవించారు. ముడిసరుకు ధరలతో నేతన్నలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారకి సబ్సిడీని 80 శాతం వరక పెంచాలని కోరారు. ఈ మేరకు కేంద్ర జౌళిశాఖ మంత్రిని కలిసి వినతి పత్రం అందజేశారు. సిరిసిల్లలో పవర్ లూం క్లస్టర్ను ఏర్పాటు చేయడం ద్వారా వేలాది మంది నేత కార్మికులకు ప్రయోజనం కలుగుతుందన్న్నారు. నాణ్యమైన వస్త్రాలను అందించడంతోపాటు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. అట్లాగే యార్న్ డిపో ఏర్పాటువల్ల సిరిసిల్లో నేత కార్మికులకు ముడి సరకులు సులభంగా తక్కువ ధరకు లభిస్తాయని బండి సంజయ్ తెలిపారు. ప్రస్తుతం నేత కార్మికులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని, పెరిగిన ఖర్చులవల్ల ముడిసరకులను కొనుగోలు చేయడం కష్టమైందన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇస్తున్న సబ్సిడీని 80 శాతానికి పెంచడంతోపాటు పావులా వడ్డీకే రుణాలు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. బండి సంజయ్ విజ్ఝప్తిపట్ల జౌళిశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ సానుకూలంగా స్పందించారు. యార్న్ డిపో ఏర్పాటుతోపాటు పవర్ లూం క్లస్టర్ మంజూరుపై చర్చించి సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. 80 శాతం సబ్సిడీ, పావులా వడ్డీకే రుణాలు వంటి అంశాల అమలు సాధ్యాసాధ్యాలపై ఉన్నతాధికారులతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.