రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీలం వెంకటేశ్ ముదిరాజ్
BC Samarabheri: జగిత్యాల, నవంబర్ 20 (మన బలగం): జనాభాలో అత్యధిక శాతం ఉన్న బీసీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిందేమీలేదని, కేవలం ఓటర్లుగానే చూస్తూన్నారని బీసీల ఐక్యతా బలాన్ని చూపేందుకు తలపెట్టిన బీసీల సమరభేరిని విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీలం వెంకటేశ్ ముదిరాజ్ పిలుపు నిచ్చారు. బుధవారం జిల్లా కేంద్రంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీలం వెంకట్ ముదిరాజ్ ఈనెల 25న హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో జరిగే బీసీల సమరభేరి పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకటేశ్ ముదిరాజ్ మాట్లాడుతూ రాష్ట్రం నలుమూలల నుంచి బీసీలు అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు. అన్ని కుల సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని బీసీల సమస్యలపై ఏర్పాటు చేసిన సమరభేరి కార్యక్రమంలో పాల్గొని సభను విజయవంతం చేయాలన్నారు.
దేశంలో 70 శాతం కలిగిన బీసీలకు కేవలం 2 వేల కోట్ల బడ్జెట్ కేటాయించడం బీసీలను అణగదొక్కే చర్యలేనన్నారు. 70 కోట్ల జనాభాకు కేంద్రంలో ఒక వెనుకబడిన తరగతుల మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్లో జరిగే సమరభేరి కార్యక్రమానికి జగిత్యాల జిల్లాలోని అన్ని కుల సంఘాల ప్రజలు హాజరుకావాలని నీలం వెంకటేశ్ ముదిరాజ్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, టి.నందగోపాల్ చిగుర్ల శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి అవారి లత, కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ, యువజన సంఘం జిల్లా అధ్యక్షులు కొక్కు గంగాధర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ తిరుపురం రాంచందర్, విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు, దండుగుల వంశీ, జిల్లా మహిళా సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి రాచకొండ రోజా, సాంస్కృతిక కార్యదర్శి బొమ్మిడి నరేశ్ కుమార్, నియోజకవర్గ అధ్యక్షురాలు బండపెల్లి మల్లీశ్వరి, పట్టణాధ్యక్షుడు రాపర్తి రవి, కోటగిరి రాజేశ్, చిలుక రాజలింగం, యూత్ కో-ఆర్డినేటర్ హృషికేశ్, బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.