A survey of school dropouts: మనబలగం, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి:బడి బయట ఉన్న విద్యార్థుల గుర్తింపునకు ప్రత్యేక సర్వే నిర్వహించాలని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ ఆదేశించారు. కలెక్టరేట్ లో జిల్లా విద్యాశాఖ, కార్మిక శాఖ, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ శాఖ , పోలీసు శాఖలతో అదనపు కలెక్టర్ బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లాలో ఈ నెలలో చేపట్టనున్న బడి బయటి విద్యార్థుల సర్వే పై ప్రత్యేక సూచనలు చేశారు. ప్రతి పాఠశాలలో ఒక నెల కంటే ఎక్కువగా గైర్హాజరు అయిన విద్యార్థులను గుర్తించి వారిని బడి బయట విద్యార్థులుగా గుర్తించాలని తెలిపారు. 15 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల వయస్సు మధ్య ఉన్న విద్యార్థులు విద్యను ఆపివేస్తే వారికి ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా విద్యాభ్యాసం కొనసాగించడానికి ప్రేరేపించాలని సూచించారు. విద్యార్థులు బడికి రాకపోవడానికి గల కారణాలను తెలుసుకోవాలని, అలాగే విద్యార్థులందరినీ పాఠశాలలు ఆకర్షించే విధంగా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కృషి చేయాలని పిలుపు నిచ్చారు.
జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము బడిబయటి విద్యార్థుల గుర్తింపునకు సర్వే నిర్వహిస్తారని, అది డిసెంబర్, జనవరి నెలల్లో నిర్వహించాల్సి ఉందని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు, అధికారులు సంబంధిత ఆవాసములో ఉండే తల్లిదండ్రులు, అంగన్వాడీ టీచర్లు, రిటైర్డ్ ఉద్యోగులు, యువజన సంఘాలు, భాగస్వాములు చేసుకోవాలని, గ్రామ పంచాయతీ కార్యదర్శులు కూడా వీరికి సహకరించాలని ఆదేశించారు. సర్వే చేపట్టే విధానం, దానికి అవసరమైన ప్రొఫార్మాలను, సూచనలను జిల్లా విద్యాశాఖ అధికారి ఈ సమావేశంలో ఇతర అధికారులకు తెలియజేశారు. ఇటుక బట్టి ప్రాంతాలను, పని ఆవాసాలను, వలస వచ్చే కార్మికులు ఎక్కువగా ఉండే ప్రదేశాలను గుర్తించి అక్కడ ప్రత్యేక సర్వే చేయాలని సూచించారు. గత ఏడాది దాదాపు 420 మంది గుర్తించి సమీప స్కూళ్లు, వర్క్ సైట్ స్కూల్ లలో చేర్పించామని వివరించారు. జిల్లా విద్యాధికారి జగన్ మోహన్ రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీ రాజం, కార్మిక శాఖ అధికారి నజీర్ అహ్మద్ పాల్గొన్నారు.
