జగిత్యాల టౌన్ పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన ఎస్పీ
Jagityal SP: జగిత్యాల, డిసెంబర్ 30 (మన బలగం): ప్రతి ఫిర్యాదుపై సత్వరమే స్పందించి బాధితులకు తక్షణమే న్యాయం చేసే విధంగా విధి నిర్వహణ ఉండాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. సోమవారం వార్షిక తనిఖీలో భాగంగా జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్ను ఎస్పీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పైన వెంటనే స్పందిస్తూ బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా భరోసా కల్పించాలని, బాధితులకు ఏదైనా సమస్య ఉంటే వెంటనే పోలీస్ స్టేషన్లో సంప్రదించాలన్నారు. పోలీస్ స్టేషన్లో పెట్రోల్ కార్, బ్లూ కోట్ సిబ్బంది సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారని, సంఘటన స్థలానికి నిమిషాల్లో చేరుకుంటున్నారని తెలిపారు. ఈ సందర్భంగా పెండింగ్లో ఉన్న కేసులపై రివ్యూ చేశారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని కేసుల నమోదు, శాంతిభద్రతల పరిరక్షణకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది వారి డ్యూటీల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రిసెప్షన్ వర్టికల్ నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుళ్లను పిటిషన్ మేనేజ్మెంట్లో ఎంట్రీ చేసిన డేటాను తనిఖీ చేశారు. రిసెప్షనిస్ట్గా ప్రతి దరఖాస్తుపై తప్పనిసరిగా పిటిషన్ మేనేజ్మెంట్లో జనరేట్ చేసినా రిసిప్ట్ ఇవ్వాలని ఎస్పీ సూచించారు. పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో 5 ఎస్ విధానాన్ని పాటిస్తూ పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు.
అదేవిధంగా ఫైల్స్, క్రమపద్ధతిలో నిర్దేశిత ప్రదేశాల్లో ఉండేలా చూసుకోవాలని సూచించారు. రికార్డ్ రూమ్, రైటర్ రూమ్ తదితర అన్ని విభాగాలు తిరిగి ఎస్పీ పరిశీలించారు. సైబర్ నేరాల బారిన పడకుండా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో అవగాహన పెంచాలన్నారు. తరుచూ రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను యాక్సిడెంట్ జోన్లుగా, బ్లాక్ స్పాట్స్గా గుర్తించి, రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం సిబ్బందితో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఉంటూ విధి నిర్వహణలో క్రమశిక్షణతో ఉండాలని సూచించారు. పోలీస్ శాఖ నూతన టెక్నాలజీ అధునాతన టెక్నాలజీ ఉపయోగిస్తున్న దాని గురించి అధికారులకు సిబ్బందికి పూర్తి అవగాహన ఉండాలని సూచించారు. సిబ్బందికి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని, ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పోలీస్ స్టేషన్కు అనుసంధానం చేసే విధంగా ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూంను ఎస్పీ ప్రారంభించారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్పీ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రఘు చందర్, టౌన్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్సైలు కిరణ్ కుమార్, మన్మథరావు, గీత, మల్లేశం, పోలీస్ సిబ్బంది ఉన్నారు.