Meta Fund victims: జగిత్యాల ప్రతినిధి, మార్చి 12 (మన బలగం): లక్షల్లో లాభాలోస్తాయని ఆశ చూపి మెటా ఫండ్ యాప్లో డబ్బులు పెట్టించిన కీలక వ్యక్తి ఇంటి ఎదుట మెటా ఫండ్ బాధితులు బుధవారం ఆందోళనకు దిగారు. జగిత్యాలలోని మెజారిటీ ప్రజలకు వివిధ యాప్లను పరిచయం చేసిన జగిత్యాల పట్టణానికి చెందిన కస్తూరి రాకేష్ అనే వ్యక్తి మెటా ఫండ్ పేరిట మరో యాప్ను పరిచయం చేశాడు. పెట్టిన పెట్టుబడికి రెండింతలు లాభాలోస్తాయని ఆశ చూపి పెట్టుబడులు పెట్టించుకొన్న రెండు నెలలకే యాప్ మూత పడగా డబ్బుల గురించి బాధితులు అడుగగా తిరిగి స్టార్ట్ అవుతుందని నమ్మబలుకుతూ కాలం గడుపుతూ వస్తున్నాడని బాధితులు అంటున్నారు. చివరకు విసిగి పోయిన కొడిమ్యాలకు చెందిన బాధితులు బుధవారం కస్తూరి రాకేష్ ఇంటి ముందు ఆందోళనకు దిగారు. బాధితుల అవేశాన్ని చూసిన కస్తూరి రాకేష్ డయల్ 100కు ఫోన్ చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు.
పోలీసులకు రాకేష్పై ఎందుకంత ప్రేమెందుకో..
లక్షల రూపాయలు కోల్పోయి బాధితులు ఆందోళనకు దిగితే నష్టం చేసిన రాకేష్ను స్టేషన్ తీసుకొని పోకుండా సమస్యను పరిష్కరించు కోవాలంటూ వచ్చిన పోలీసులు సూచించడంతోనే కస్తూరి రాకేశ్పై పోలీసులకు ఎందుకంత ప్రేమ అనే చర్చ అక్కడ మొదలయింది. అటు తిరిగి ఇటు తిరిగి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అనుచరుడని పోలీసులు పట్టించుకోవడం లేదా అన్న అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. పోలీసులు నష్టపోయిన వారి పక్షాన వుంటారా నష్ట పరిచిన వారికి అండగా వుంటారా అన్న ప్రచారంతో పోలీస్ శాఖపై ప్రజలు నిప్పులు చేరుగుతున్నారు. యాప్ లతో మోసగిస్తే ఫిర్యాదు చేయాలని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ గతంలోనే ప్రకటన జారిచేశారు. కస్తూరి రాకేష్ కు వంత పాడిన పోలీసుల పై చర్యలు ఎలా వుంటాయో చూడాలి.