- పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి
- విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలి
- ఎంపీడీవో కార్యాలయం, పీహెచ్సీ, టీజీఆర్ఎస్ విద్యాలయం తనిఖీ
Collector Sandeep Kumar Jha: రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి, మార్చి 12 (మన బలగం): జిల్లాలోని అర్హులందరూ ఎల్ఆర్ఎస్ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పిలుపునిచ్చారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయాన్ని కలెక్టర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ప్రజాపాలన కౌంటర్ను పరిశీలించి, ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి? వాటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం టీ ఫైబర్ సర్వర్ రూంను పరిశీలించి, మండలంలో ఇంటి, ఇతర పన్నుల వసూలుపై ఆరా తీశారు. మండలంలో భూముల క్రమబద్ధీకరణకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయి ? వాటిలో ఎన్ని అప్రూవ్ అయ్యాయని ఎంపీడీఓ లక్ష్మీనారాయణను ఆరా తీయగా, మొత్తం 2893 దరఖాస్తులు అప్రూవ్ అయ్యాయని కలెక్టర్ దృష్టికి ఎంపీడీఓ తీసుకెళ్లారు. ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు పిలుపు ఇచ్చారు. ప్రతి దరఖాస్తుదారుడికి ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని నేరుగా.. వారు అందుబాటులో లేకపోతే ఫోన్ ద్వారా సంప్రదించాలని అధికారులు, సిబ్బంది సూచించారు. ఇంటి, ఇతర పన్నులను సకాలంలో చెల్లించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో లక్ష్మీనారాయణ, ఎంపీఓ మీర్జా తదితరులు పాల్గొన్నారు.

పరిసరాలు శుభ్రంగా ఉండాలి
తంగళ్లపల్లి మండలం నేరెళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ఓపీ, ఇతర రిజిస్టర్లు పరిశీలించారు. మందులు ఇచ్చే గది, ల్యాబ్ తనిఖీ చేసి, మందులు, వ్యాక్సిన్లపై ఆరా తీశారు. ప్రభుత్వ వైద్య సేవలు సద్వినియోగం చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని వైద్యులు, సిబ్బందికి సూచించారు. ప్రభుత్వ దవాఖానలోనే ప్రసవాలు అయ్యేలా చూడాలని పేర్కొన్నారు. ఆసుపత్రి పరిసరాలు శుభ్రంగా ఉండాలని ఆదేశించారు. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ వైద్యురాలు చంద్రికా రెడ్డి, సిబ్బంది తదితరులు ఉన్నారు.

మెనూ ప్రకారం భోజనాలు పెట్టాలి
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనాలు పెట్టాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. తంగళ్లపల్లి మండలం నేరెళ్లలోని టీజీఆర్ఎస్ (గర్ల్స్) విద్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు రాగి జావ ఇస్తుండగా పరిశీలించారు. మెనూ ప్రకారం ఈ రోజు ఏఏ ఆహార పదార్థాలను సిద్ధం చేస్తున్నారని ప్రిన్సిపాల్ రాధను ఆరా తీయగా, బగార అన్నం, ఆలు గడ్డ కూర, టమాటా, ఉడికించిన గుడ్డు సిద్ధం చేస్తున్నామని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. పబ్లిక్ పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా ప్రత్యేక శ్రద్ధ, ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని సూచించారు.
