Inter Board Academic Joint Secretary: జగిత్యాల ప్రతినిధి, జనవరి 10 (మన బలగం): ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని ఇంటర్మీడియట్ బోర్డు అకడమిక్ జాయింట్ సెక్రెటరీ వసుంధరదేవి అన్నారు. ఇంటర్మీడియట్ బోర్డు డైరెక్టర్ కృష్ణ ఆదిత్య ఆదేశాల మేరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు పరిశీలకులుగా వచ్చిన శ్రీమతి వసుంధర దేవి, జగిత్యాల జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి బొప్పరాతి నారాయణతో కలిసి జగిత్యాల జిల్లాలోని జగిత్యాల పట్టణ బాలుర, బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాలలతో పాటు మల్యాల, కొడిమ్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలను శుక్రవారం సందర్శించి రికార్డులను పరిశీలించి ప్రిన్సిపాళ్ళు, అధ్యాపకులు, విద్యార్థులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వసుందర దేవి మాట్లాడుతూ విద్యార్థులు సమయాన్ని వృథా చేసుకోకుండా సద్వినియోగం చేసుకొని తమ లక్ష్యానికి అనువుగా మంచిగా చదివి జీవితంలో ఉన్నత స్థితికి చేరాలని ఆకాంక్షించారు. మార్చిలో జరగనున్న పరీక్షలకు విద్యార్థులు ప్రణాళిక బద్ధంగా సన్నద్ధం కావాలన్నారు. విద్యార్థులు ఇప్పటి నుంచే నడుస్తున్న చదువులతోపాటు పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని చదవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రిన్సిపాళ్లు దాసరి నాగభూషణం, ఆలియా మక్సూద్, మోతె శివరామకృష్ణ, కొంక వేణు, అధ్యాపకులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.