విద్యార్థులతో కేక్ కట్ చేయించిన ప్రిన్సిపాల్
Celebrations on hike in diet charges: జగిత్యాల, నవంబర్ 2 (మన బలగం): రాష్ట్ర సర్కారు ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థుల డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచడంపై హర్షం వ్యక్తం చేస్తూ శనివారం గొల్లపల్లిలోని మహాత్మా జ్యోతి బాఫూలే బాలికల గురుకుల పాఠశాలలో సంబురాలు జరుపుకొన్నారు. పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ చెరుకు సుష్మిత విద్యార్థులతో కేక్ కట్ చేయించి సంబురాలు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా డీసీవో, ప్రిన్సిపాల్ చెరుకు సుష్మిత మాట్లాడుతూ నిరుపేద విద్యార్థిని, విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులకు నాణ్యతతో కూడిన భోజనం అందించాలని డైట్, కాస్మోటిక్ చార్జీలను పెంచారన్నారు.
ఈ నిధులు పక్కదారి పట్టకుండా ఉండేందుకు గ్రీన్ చానల్ ద్వారా చెల్లించే ఏర్పాట్లు చేయడం విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో ఈ సారి 40 శాతం డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచడంతో రాష్ట్రంలోని 7 లక్షల 65వేల 705 మంది విద్యార్థులకు మేలు జరుగుతుందని అన్నారు. డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంలతో పాటు పలు శాఖల కార్యదర్శులకు విద్యార్థుల పక్షాన ప్రిన్సిపాల్ చెరుకు సుష్మిత కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల టీచర్లు, సిబ్బంది, విద్యార్థినులు ఉన్నారు.