Nirmal Collector: నిర్మల్, నవంబర్ 1 (మన బలగం): సమగ్ర ఇంటింటి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సారంగాపూర్ మండలంలోని చించోలి( బి) గ్రామంలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ అంశాలపై కుల సర్వే నిర్వహణకై అధికారులు చేస్తున్న సన్నద్ధత తీరును స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్తో కలిసి ఆమె పరిశీలించారు. గ్రామానికి సంబంధించిన వివరాలను, హౌస్ లిస్టింగ్ తీరుకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సమగ్ర సర్వేలో ప్రజల సహకారం ఎంతో అవసరమన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ సర్వే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. కుటుంబ సర్వేలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ అంశాలను సమీక్షించనున్నట్లు తెలిపారు. ఈ సర్వే కోసం ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు బ్లాక్ల వారీగా ఇండ్ల వివరాలను సిద్ధం చేసుకోవాలన్నారు. ప్రతి ఇంటికి ఎన్యూమరేటర్లు వెళ్లి నిర్ణీత ప్రొఫార్మాలో సర్వే వివరాలను నమోదు చేయాలన్నారు. సర్వే పూర్తయిన ఇంటికి స్టిక్కర్లను అతికించాలన్నారు. సర్వే నిర్వహణలో సమయపాలన, ఖచ్చితత్వం పాటించాలని, ఎలాంటి లోటుపాట్లు లేకుండా సర్వేను పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ప్రణాళిక అధికారి తహసీల్దార్ శ్రీదేవి, ఎంపీడీవో లక్ష్మీ కాంతారావు, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.