District Collector Abhilasha Abhinav: నిర్మల్, మార్చి 19 (మన బలగం): ఎండల తీవ్రత అధికంగా ఉన్న కారణంగా ప్రజలు చలివేంద్రాలను వినియోగించుకొని దాహార్తిని తీర్చుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. పట్టణంలోని శివాజీ చౌక్ (మంచిర్యాల చౌరస్తా)లో మున్సిపల్ అధికారులు బుధవారం ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్తో కలిసి రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ప్రజలకు కలెక్టర్ మంచినీటిని అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పట్టణంలో బస్టాండ్, ప్రధాన కూడళ్లు, మార్కెట్లు, జనసంచారం అధికంగా ఉన్న ప్రదేశాల్లో విరివిగా చలివేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రజలంతా చలివేంద్రాలను వినియోగించుకోవాలని తెలిపారు. ఎండలు విపరీతంగా ఉన్నాయని, వివిధ పనుల నిమిత్తం పట్టణానికి వచ్చే ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, అర్బన్ తహసిల్దార్ రాజు, మున్సిపల్ డీఈ హరిభువన్, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.