వేములవాడ బీసీ సంక్షేమ హాస్టల్ ఆకస్మిక తనిఖీ
Hostel check: మనబలగం, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా? అని విద్యార్థులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆరా తీశారు. వేములవాడ పట్టణంలోని బీసీ సంక్షేమ హాస్టల్ను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా హాస్టల్లోని విద్యార్థుల వసతి గదులు, ఆవరణ, పరిసరాలు, స్టోర్ రూం, కిచెన్ గదిని పరిశీలించారు. డిప్లొమా పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులతో మాట్లాడారు. రోజూ మెనూ ప్రకారం భోజనాలు అందిస్తున్నారా? అని ఆరా తీశారు. రానున్న పరీక్షలకు ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని సూచించారు. ప్రతి సబ్జెక్టుపై పట్టు సాధించాలని పేర్కొన్నారు. హాస్టల్లో ఎందరు విద్యార్థులు ఉంటున్నారో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ లక్ష్మీనారాయణను అడగగా, 97 మంది విద్యార్థులు ఉంటున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. నిత్యం విద్యార్థులతో ఆయా పాఠ్యాంశాలు చదివించాలని, రాయించాలని పేర్కొన్నారు.