- వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలి
- సీపీఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి
Harassment of tenants: కరీంనగర్, జనవరి 4 (మన బలగం): కరీంనగర్ నగరంలోని కలెక్టర్ రేట్కు అతి సమీపంలో ఉన్న కృషి భవన్లో ఉన్న కిరాయిదారులను ఆటంకాలు కలిగిస్తూ మనోవేదనకు గురిచేస్తున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని సీపీఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, సహాయ కార్యదర్శి పైడిపల్లి రాజు డిమాండ్ చేశారు. శనివారం షట్టర్లను, నీళ్లతో నిండిన రూములను, నీళ్లు పడి చెడిపోయిన కంప్యూటర్లను, ఫర్నిచర్ను వారు సందర్శించారు. అక్కడి పరిస్థితిని చూసి వారు అవాక్కు అయ్యారు. ఈ సందర్భంగా కసిరెడ్డి సురేందర్ రెడ్డి, పైడిపల్లి రాజు మాట్లాడుతూ, మానవ విలువలు పూర్తిగా మంటగలిసే విధంగా షట్టర్పై కప్పునకు రంధ్రం చేసి అందులో నుంచి నీళ్లు వదిలిపెట్టి ఆఫీసులోని సామగ్రి, విలువైన పేపర్స్, డాక్యుమెంట్స్ పూర్తిగా నీటి మయం చేయడం దుర్మార్గమైన చర్య అని, దీనిని ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. ఒక షెటర్లో పొల్యూషన్ సెంటర్, మరో షటర్లో ఆటో కన్సల్టెన్సీ కార్యాలయం ఉందని, వీరు ఉపాధి లేక స్వయం ఉపాధితో పనిచేసుకుంటూ జీవనం గడుపుతున్నారని, వీరి పనులకు ఆటకం కలగజేస్తూ 3 నెలల నుంచి మానసికంగా వేధింపులకు గురి చేస్తూ, ఒత్తిడిలు, భయభ్రాంతులకు గురిచేస్తున్నారని తెలిపారు.
మానవత్వన్ని పూర్తిగా మరిచిపోయి నిర్ధాక్షణంగా ప్రవర్తిస్తున్న కృషి భవన్ నిర్వహణదారులపై జిల్లా కలెక్టర్ స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతోపాటు వీరి షట్టర్ల ముందు చెత్తాచెదారం,షెటర్కు అడ్డంగా ఇటుకలు, గోవా కట్టలు కట్టి పూర్తిగా షట్టర్ కనబడకుండా మూసివేసే కుట్రలు చేయడం దుర్మార్గమైన చర్య అని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కిరాయిదారులు పలుమార్లు కలెక్టర్కు విన్నవించినా పట్టించుకునే నాథుడు లేకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం స్థలం ఇచ్చి భవనానికి నిధులు కేటాయించి నిర్మిస్తే కొందరు వ్యవసాయ శాఖ రిటైర్ ఉద్యోగ సంఘం నాయకులు తమదే నడవాలని పెత్తనం చేస్తూ భయభ్రాంతులకు గురిచేయడం ఏంటని వారు ప్రశ్నించారు. వెంటనే జిల్లా అధికారులు స్పందించి ఈ యొక్క సమస్యను పరిష్కరించి నిరుద్యోగుల జీవితాలను కాపాడాలని, లేని పక్షంలో సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిస్తామని కసిరెడ్డి సురేందర్ రెడ్డి, పైడిపల్లి రాజు హెచ్చరించారు.