korutla hospital
korutla hospital

high tension: ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యంతో వ్యక్తి మృతి

  • ఆస్పత్రిని ధ్వంసం చేసిన బంధువులు
  • డ్యూటీ డాక్టర్‌ను సజీవదహనానికి యత్నం
  • పోలీసుల అదుపులో వైద్యుడు
  • ఆస్పత్రి ఎదుట మృతదేహంతో ఆందోళన
  • పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు

high tension: కోరుట్లలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. స్పృహలో లేని వ్యక్తిని తీసుకుని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. వైద్యులు చికిత్స చేయడానికి ఆలస్యం చేయడంతో స్ట్రెచర్ పైనే ప్రాణాలు పోవడంతో బంధువులు ఆగ్రహం చెంది ఆసుపత్రిని ధ్వంసం చేశారు. అద్దాలు పగులగొట్టారు. ఫర్నిచర్ విరగ్గొట్టి, చెల్లాచెదురు చేశారు. వైద్యసిబ్బందిని చితకబాదారు. డ్యూటీ డాక్టర్ శ్రావణ్ కుమార్ బెదిరిపోయి ఓపీ గదిలో తల దాచుకుంటే కిటికీల గుండా పెట్రోల్ చల్లి సజీవ దహనానికి బంధువులు యత్నించారు. దీంతో బెదిరిపోయిన డాక్టర్ పోలీసులకు సమాచారం అందించారు. సకాలంలో స్పందించిన పోలీసులు వైద్యుడిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆగ్రహం చెందిన కుటుంబ సభ్యులు, బంధువులు డాక్టర్‌పై దాడి చేయడానికి ప్రయత్నించగా పోలీసులు చెదరగొట్టారు.

అసలేం జరిగింది.?
కోరుట్ల అర్బన్ కాలనీలో నివాసముంటున్న మహ్మద్ ముజాయిద్ (ముజ్జు-44) ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. మృతుడికి భార్యా ఇద్దరు పిల్లలు ఉన్నారు. మరో 10 రోజుల్లో కూతురు పెళ్లి ఉందని సమాచారం. ఆటోలో ప్రయాణికులను పట్టణ శివారులో గల సాయిబాబా గుడి వద్ద వదిలేసి తిరిగి వస్తుండగా అతను స్పృహ కోల్పోయాడు. దీంతో స్థానికులు గమనించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం కుటుంబ సభ్యులకు చేరవేశారు. ఈలోగా వైద్యులకు సమాచారం అందించగా.. ఆదివారం సెలవు దినం కావడంతో డాక్టర్ శ్రావణ్ కుమార్ ఒక్కరే డ్యూటీలో ఉన్నారు. ఇన్ పేషెంట్లను చూసి.. ఇతనికి చికిత్స అందించే లోపే మృతి చెందినట్లు డాక్టర్ నిర్ధారించడంతో మృతుడి బంధువుల్లో ఒక్కసారిగా ఆగ్రహావేశాలు పెల్లుబికి ఆసుపత్రిని ధ్వంసం చేయాల్సి వచ్చింది.

మృతిపై భిన్నాభిప్రాయాలు
ఏం జరిగిందని గుమిగూడిన జనాలను ఆరాతీస్తే కూతురు పెళ్లి ఉందని మానసిక ఆందోళన చెంది బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైనట్టు.. వెంటనే పేదోడు కాబట్టి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చినట్టు కొందరు చెబుతున్నారు. ఇక్కడ 30 పడకల ఆసుపత్రి నుంచి గత ప్రభుత్వం దీన్ని 100 పడకల ఆసుపత్రిగా చేసినా పూర్తిస్థాయిలో వైద్యులను.. చికిత్సకు అవసరమైన వైద్య పరికరాలను సమకూర్చకపోవడం వల్ల మృతి చెందాడంటున్నారు. అందులోనూ ఆదివారం కావడం చేత ఉన్న సిబ్బంది కూడా అంతంత మాత్రమే ఉండడంతో మృతికి కారణమంటున్నారు. కాదు.. అతను తీవ్రమైన ఎండవేడిమికి వడదెబ్బ తగిలి మృతిచెందాడని మరికొందరు చెబుతున్నారు. వివరాలు అందించడానికి వైద్యుడు పోలీసుల అదుపులో ఉన్నారు.

పోలీసులు రాహుల్ గాంధీ, కేసీఆర్ సభలకు
వ్యక్తి మృతి ఆస్పత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తతకు దారితీయగా శాంతి భద్రతల కోసం సమయానికి కోరుట్ల పోలీసులు అందుబాటులో లేరు. నిర్మల్ జిల్లాలో రాహుల్ గాంధీ బహిరంగ సభకు కొందరు.. జగిత్యాల జిల్లా కేంద్రంలో కేసిఆర్ బహిరంగ సభకు పోలీసులు బందోబస్తుకు వెళ్లడంతో హుటాహుటిన మెట్‌పల్లి ఎస్ఐ చిరంజీవి ఇతర స్టేషన్ నుండి ఎస్సైలు.. రిజర్వ్ పోలీసులు ఆసుపత్రికి చేరుకుని ఆందోళనకారులను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. కుటుంబ సభ్యులు.. బంధువులతో పోలీసులు మాట్లాడి ఉద్రిక్త పరిస్థితులను అదుపులోకి తెచ్చి శాంతించేలా చర్చలు చేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

పాత్రికేయులపై బూతు పురాణం
మృతుడి ఫోటోలు.. ఆసుపత్రి ధ్వంసం.. డాక్టర్‌పై దాడి.. ఆందోళననను చిత్రీకరిస్తున్న స్థానిక పాత్రికేయులపై మృతుడి కుటుంబ సభ్యులు బూతుపురాణానికి దిగారు. కొందరి కెమెరాలు.. ఫోన్లు లాక్కున్నారు. పోలీసులు.. తెలిసిన వారు మాట్లాడడంతో తిరిగి ఇచ్చేసి పరిస్థితి సద్దుమణిగేలా చేశారు. ఇంకా ఆసుపత్రి వద్ద మృతదేహంతో బంధువులు ఆందోళన చేస్తూనే ఉండడంతో పోలీసు బలగాలు మోహరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *