Collector Abhilash Abhinav: నిర్మల్, ఫిబ్రవరి 11 (మన బలగం): భూ సంబంధిత సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. మంగళవారం నిర్మల్ పట్టణ తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ, పోలీసు శాఖలకు సంబంధించి భూ సమస్యలను పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన ‘స్పందన’ ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని పలు రెవెన్యూ, పోలీసు కేసులతో ముడిపడి ఉన్న భూ సమస్యల పరిష్కారానికి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రెవెన్యూ, పోలీస్ శాఖలకు సంబంధించి పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, సమస్య పరిష్కారానికి రెవెన్యూ, పోలీసు అధికారులకు పలుకీలక సూచనలు చేశారు. భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా భూ సమస్యలకు సంబంధించి అర్జీలను పరిష్కరించాలన్నారు. ఈ స్పందన కార్యక్రమం ద్వారా జిల్లాలో చాలా రోజులుగా పెండింగ్లో ఉన్న పలు భూ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు. భూ సమస్యలకు సంబంధించి ఫిర్యాదులు అందిన వెంటనే రెవెన్యూ, పోలీసు అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో వెళ్లి భూ హద్దులను గుర్తించాలన్నారు. పోలీసు శాఖతో ముడిపడి ఉన్న భూ సమస్యల పరిష్కారం కోసం ప్రతి మంగళవారం తహసీల్దార్ కార్యాలయాల్లో రెవెన్యూ, పోలీసు శాఖల ఆధ్వర్యంలో 11 గంటల నుంచి 12 గంటల వరకు ఫిర్యాదులు స్వీకరిస్తారని కలెక్టర్ తెలిపారు. ప్రజలంతా ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ సమస్యలపై ఫిర్యాదులను అందించవచ్చునన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రాజేశ్ మీనా, ఆర్డీవో రత్నకళ్యాణి, తహసీల్దార్ రాజు, రెవెన్యూ, పోలీసు శాఖల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.