CM Revanth Reddy
CM Revanth Reddy

CM Revanth Reddy: ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌కు స్థల సేకరణ పూర్తవ్వాలి: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: తెలంగాణ బ్యూరో/ మన బలగం: రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా తలపెట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌కు సంబంధించి నిర్దేశిత గడువులోగా పనులు పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యా శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. విద్యా శాఖ ఉన్నతాధికారులతో శుక్రవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ స్కూళ్లకు అవసరమైన స్థలాల సేకరణ, ఇతర పనుల పురోగతిని సీఎం అడిగి తెలుసుకున్నారు. స్థలాల కేటాయింపు పూర్తయిన చోట అనుమతులు, ఇతర పనులను వేగంగా చేయాలని సూచించారు. ప్రతిపాదిత స్థలాలు రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుకు అనువుగా ఉన్నాయో లేదో ముందుగా పరిశీలించాలని చెప్పారు. అనువైన స్థలం లేని చోట ప్రత్యామ్నాయ స్థలాన్ని సేకరించాలని ఆదేశించారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల కోసం జిల్లా కలెక్టర్లు క్షేత్ర స్థాయిలో పర్యటించి త్వరగా స్థలాలను గుర్తింపు ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. దీనిపై వారం రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఇప్పటికే స్థల సేకరణ జరిగిన నియోజకవర్గాల్లో యుద్ధ ప్రాతిపదికన పనులు మొదలు పెట్టాలని తెలిపారు. రెండేళ్లలో 105 నియోజకవర్గాల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలతో వంద శాతం పనులు పూర్తికావాలని చెప్పారు. వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయ అభివృద్ధికి అవసరమైన నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. ఈ విశ్వవిద్యాలయంలో భవిష్యత్తు అవసరాలకు తగినట్టుగా పూర్తి స్థాయి ప్రమాణాలతో సరైన మౌలిక వసతులు కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *