Collector Abhilasha Abhinav: నిర్మల్, ఫిబ్రవరి 21 (మన బలగం): అగ్ని ప్రమాద బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ హామీ ఇచ్చారు. శుక్రవారం పెంబి మండలం రాయదారి గ్రామంలో గురువారం జరిగిన అగ్ని ప్రమాద బాధిత కుటుంబ సభ్యులను అధికారులతో కలిసి ఆమె పరామర్శించారు. బాధితులతో ప్రమాదానికి గురైన ఇండ్ల ప్రదేశాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా బాధితులతో కలెక్టర్ మాట్లాడుతూ అగ్ని ప్రమాద ఘటన దురదృష్టకరమన్నారు. ఈ ఘటనలో 8 ఇండ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయని, బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తక్షణ సహాయం కింద రేపటిలోగా బాధితుల ఖాతాల్లోకి లక్ష రూపాయలు జమ చేస్తామని తెలిపారు. వారికి నిత్యావసర సరుకులు, బట్టలను కలెక్టర్ అందజేశారు. బాధితులు యథాస్థితికి చేరుకునే వరకు వారికి భోజనం అందించాలని, రాత్రి బస చేసేందుకు ఏర్పాట్లను చేయాలన్నారు. బాధితులు నూతన ఇండ్ల కోసం అధికారులకు తమ వివరాలను అందజేయాలన్నారు. నూతన ఇండ్ల మంజూరు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ పరంగా అందాల్సిన అన్ని రకాల సహాయాన్ని అందిస్తామని తెలిపారు. అగ్ని ప్రమాద శకలాలను వీలైనంత త్వరగా తొలగించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అగ్ని ప్రమాద బాధితులు ఎటువంటి ఆందోళన చెందవద్దని, జిల్లా యంత్రాంగం వారికి అండగా ఉంటారని ధైర్యం చెప్పారు. అనంతరం గ్రామ ప్రభుత్వ పాఠశాలలో అగ్ని ప్రమాద బాధితులతో కలిసి కలెక్టర్ భోజనం చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, మండల ప్రత్యేక అధికారి నరసింహ రెడ్డి, డిఎస్ఓ కిరణ్ కుమార్, తహసిల్దార్ లక్ష్మణ్, ఎంపీడీవో రమాకాంత్, అధికారులు, సిబ్బంది, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.