Indiramma Indlu: ఇబ్రహీంపట్నం, మార్చి 4 (మన బలగం): ప్రభుత్వం నిర్దేశించిన నమూనా ప్రకారం లబ్ధిదారులు ఇల్లు నిర్మాణం చేసుకోవాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ అన్నారు. మంగళవారం ఇబ్రహీంపట్నం మండలంలోని ఎర్రపూర్, ఎర్రపూర్ తండాలోని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల స్థలాలను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణయించిన నమూనా ప్రకారం ఇండ్లు నిర్మించుకోవాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు త్వరితగతిన ఇండ్ల నిర్మాణం ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు. ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన వారికి మొదటి దశలో బేస్మెంట్ లేవల్లో 1 లక్ష రూపాయలు, గోడల నిర్మాణం దశలో 1 లక్ష రూపాయలు, స్లాబ్ దశలో 2 లక్షల రూపాయలు, మిగతావి ఇండ్ల నిర్మాణం పూర్తి చేసుకుని కలర్ వేసిన తరువాత 1 లక్ష రూపాయలు ప్రభుత్వం అందిస్తుందని వివరించారు. గృహ నిర్మాణ మేస్త్రీలు, కార్మికులు సకాలంలో ఇండ్ల నిర్మాణానికి లబ్ధిదారులకు సహకారం అందించాలని తెలిపారు. గృహ నిర్మాణ ఇందిరమ్మ యాప్లో పొందుపరిచే విషయంలో సాంకేతిక సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో డీపీవో మదన్మోహన్, హౌసింగ్ డీఈ ప్రసాద్, తహశీల్దార్ ప్రసాద్, ఎంపీడీవో సాంబరి చంద్రశేఖర్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
