- యంగ్ ఇండియా ఇంటర్నెషనల్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు
- శుభపరిణామం అన్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్
MLA Sanjay Kumar: జగిత్యాల ప్రతినిధి, మార్చి 10 (మన బలగం): జగిత్యాల విద్యావ్యవస్థకు అదృష్టం పట్టింది. చదువుల తల్లి మెడలో మరో మణిహారంలా యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్ను జగిత్యాలకు కేటాయించారు. దీంతో ఎమ్మె్ల్యే డాక్టర్ సంజయ్ కుమార్తోపాటు ఆయన అభిమానులు, కార్యకర్తల్లో సంతోషం నిండిపోయింది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించేందుకు ది ఇండియన్ సర్టిఫికెట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (ఐసీఎస్ఈ) అందిస్తుందని ఎమ్మెల్యే అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్న నేపథ్యంలో ఇచ్చిన హామీ మేరకు జగిత్యాల నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు చేయటం పట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జగిత్యాల జిల్లా కేంద్రం ఎడ్యుకేషన్ హబ్గా మారిందని, విద్యాభివృధికి తన వంతుగా చేస్తున్న కృషిలో భాగమేనన్నారు. గత ప్రభుత్వ హయాంలో పూర్తయిన నర్సింగ్ కళాశాలను ప్రారంభించడానికి కృషి చేయటం జరిగిందన్నారు.
2018 ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు గత ముఖ్యమంత్రిని కోరి మెడికల్ కాలేజీ సైతం సాధించుకున్నామన్నారు. మెడికల్ కాలేజీ నిధుల సాధన కోసం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహను వారి కార్యాలయంలో కలిసి నిధుల మంజూరుకు కృషి చేయాలని కోరినట్లు తెలిపారు. సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే తెలిపారు. రాయికల్ మండలంలో కస్తూర్బా పాఠశాలకు 4 కోట్లతో నూతన భవనం మంజూరు అయిందని అన్నారు. బీర్పూర్ మండలానికి కస్తూర్బా పాఠశాల మంజూరు కాగా తుంగురు గ్రామంలో అద్దె భవనంలో ప్రారంభించ బోతున్నామన్నారు. జగిత్యాల నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల్లో సైన్స్ ల్యాబ్లు మంజూరు అయ్యాయన్నారు. 5 కోట్లతో అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్ స్కిల్ యూనివర్సిటీ అనుబంధంగా టీఆర్ నగర్లో ఏర్పాటు చేస్తున్నాన్నారు. ఇందుకు సంబందించి పనులు మొదలయ్యాయని అన్నారు.
రేవంత్ రెడ్డి సర్కార్లో ప్రభుత్వం ఏర్పడగానే అమ్మ ఆదర్శ పాఠశాలలు మౌలిక సదుపాయాలకు నిధులు మంజూరు చేశారని గుర్తుచేశారు. న్యూ హైస్కూల్లో 10 లక్షలతో మౌలిక సదుపాయాలకు జిల్లా కలెక్టర్ నిధులు మంజూరు చేశారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు అద్దె భవనంలో ఉండగా ఇబ్బంధులను గుర్తించిన ముఖ్యమంత్రి అన్ని జిల్లాల్లో నూతన భవనాలు మంజూరు చేశారని, 200 కోట్లతో జగిత్యాల చల్గల్ వాలంతరీ కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టడం జరుగుతుందని బడ్జెట్ కూడా విడుదల చేయటం జరిగింది అని అన్నారు. జగిత్యాల నియోజకవర్గంలో విద్య అభివృధి కోసం ఎల్లప్పుడూ తన వంతుగా కృషి చేస్తామని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహకారంతో అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు.