BC Commission Chairman
BC Commission Chairman

BC Commission Chairman: చులకనతో పిలిచే కులాల పేర్లను గౌరవప్రదం చేస్తాం: బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్

  • అభ్యంతరాలు, సూచనల మేరకు కులాల పేర్ల మార్పు
  • బీసీల్లోని అందరికీ రాజ్యాంగ ఫలాలు అందింస్తాం

BC Commission Chairman: జగిత్యాల ప్రతినిధి, మార్చి 27 (మన బలగం): సమాజంలో నేటికీ చులకన భావంతో పిలిచే కులాల పేర్లను గౌరవప్రదంగా పిలిచేలా వాటిని మార్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ స్పష్టం చేశారు. గురువారం జగిత్యాల పర్యటన అనంతరం మీడియాతో మాట్లాడారు.. చులకన భావంతో కులాలను పిలవడం వల్ల ఆ కులస్తులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. వారి ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బీసీ కమిషన్ రెండో రోజు పర్యటనలో భాగంగా గురువారం జగిత్యాల జిల్లాలో కమిషన్ పర్యటించింది. బీసీ కమిషన్ చైర్మన్, సభ్యులు జగిత్యాల జిల్లా పర్యటనకు విచ్చేసి, ముందుగా కొండగట్టు దేవాలయాన్ని దర్శించు కున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో చైర్మన్, సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు సిబ్బంది వారికి ఘనంగా స్వాగతం పలికారు. ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం తీర్థప్రసాదాలు అందజేసి ఘనంగా సత్కరించారు.
అనంతరం వారు నేరుగా తారక రామనగర్‌లో వీర ముష్టి కమ్యూనిటీ భవనం, గాంధీనగర్‌లో గల దొమ్మర సంఘ భవనంలో బీసీ కుల సంఘాల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఏ సమస్య ఉన్నా అధికారుల దృష్టికి తీసుకురావాలని బీసీ కమిషన్ చైర్మన్ సూచించారు. సమాజంలో ఇప్పటికీ కొన్ని కులాల పేర్లు చులకన భావంతో పిలిచేలాగా ఉన్నాయని, తిట్టు పదాలుగా వాడుతున్నారని ఆవేదన వ్యకం చేశారు. బీసీ జాబితాలోని ఎనిమిది కులాల పేర్లు మార్చాలని, కొన్ని పర్యాయపదాలు జోడించాలని వచ్చిన ప్రతిపాదనలపై ఇప్పటికే తెలంగాణ బీసీ కమిషన్ అభ్యంతరాలు కోరిందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే సిరిసిల్ల, జగిత్యాలలో పర్యటిస్తున్నామని తెలిపారు. కులాల పేర్ల మార్పులపై ఎవరికైనా అభ్యంత రాలున్నా, ఇతర పర్యాయపదాలు ఉన్నా తెలియజేయాలని కోరుతూ నోటిఫికేషన్ జారీ చేశామని వెల్లడించారు. కమిషన్‌కు వచ్చిన అభ్యంతరాలు, సూచనల ఆధారంగా ఆయా కులాల పేర్ల మార్పుకు చర్యలు తీసుకుంటామని చైర్మన్ తెలిపారు. బీసీ రిజర్వేషన్ ఫలాలు బీసీ కులాల్లోని అందరికీ అందించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు ఉపాధి, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదించిందని పేర్కొన్నారు. ఈ మేరకు వాటిని అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని, ఇది భారతదేశంలోనే చారిత్రాత్మక నిర్ణయం అని పేర్కొన్నారు. అనేక దశాబ్దాల నుంచి వెనుకబాటు గురైన బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఎంతో ప్రయోజనకరంగా మారుతాయని పేర్కొన్నారు.

కులం పేరిట ఇబ్బంది పడుతున్న వారు ఆత్మ న్యూనతా భావానికి గురికావద్దని సూచించారు. పిల్లలను చక్కగా చదివించి మంచి ప్రయోజకులను చేయాలని, ఉన్నత స్థానాలు అధిరోహించేలా అన్ని రంగాల్లో వారిని తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. పేదలకు ప్రభుత్వం విద్యారంగంలో అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని, వాటిని సద్వినియోగం చేసుకుంటూ విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దాలని సూచించారు. అదేవిధంగా ప్రభుత్వం అందిస్తున్న రిజర్వేషన్ ఫలాలు పొందాలని సూచించారు. ఆయా కులాల పేర్ల మార్పు అంశం వచ్చే నెలలో పరిష్కరిస్తామని తెలిపారు. బీసీ కులాల్లోని అందరికీ రాజ్యాంగ ఫలాలు అందించేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని ఉమ్మడి జిల్లాల్లో పర్యటించామని గుర్తు చేశారు. త్వరలో మిగతా జిల్లాల్లో పర్యటించి, ఆయా బీసీ కులాల స్థితిగతులను నేరుగా తెలుసు కుంటామని తెలిపారు. రాజీవ్ యువ వికాసం పథకాన్ని అర్హులైన నిరుద్యోగులంతా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అర్హులైన యువతీ యువకులు, రాజీవ్ యువ వికాస పథకానికి దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

వీర ముష్టి కులం పేరు మార్చాలి
వీర ముష్టి అంటే పూర్వ కాలంలో యుద్ధ వీరులుగా వుండే వారని, కాలక్రమేణా ముష్టి అనే పదం బిచ్చగాళ్ళు అడుక్కునే పర్యాయ పదంగా మారిందని వీరాముష్టి ప్రతినిధులు బీసీ కమిషన్ చైర్మన్ సభ్యుల దృష్టికి తీసుకువచ్చారు. తమ కులాన్ని వీర భద్రియ కులంగా మార్చాలని విజ్ఞప్తి చేశారు. అలాగే తమకు ఉపాధి అవకాశాలు మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

గడ వంశీయులుగా మార్చాలి
కులం సర్టిఫికెట్లో తమ కులం పేరును గడ వంశీయులుగా మార్చాలని దొమ్మరి కుల సంఘం ప్రతినిధులు బీసీ కమిషన్ చైర్మన్ సభ్యులకు విజ్ఞప్తి చేశారు. కులం పేరు దొమ్మరి ఉండడం వల్ల తాము సమాజంలో అనేక ఇబ్బందులు పడుతు న్నామని చులకన భావంతో చూస్తున్నారని వివరించారు. విద్యాలయాలు, ప్రభుత్వ సంస్థల్లో తమ పిల్లలు అవమానానికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని బీసీ కమిషన్ చైర్మన్ స్పష్టం చేశారు. కులాలను అలా పిలవడం వల్ల ఎలాంటి ఆత్మ నూన్యత భావానికి గురీకావద్దని చులకన భావంతో ఉండవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ జీ నిరంజన్, సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, రంగు బాల లక్ష్మి, బిసి సంక్షేమ జిల్లా అధికారి కల్పన, తహసిల్దార్ రామ్ మోహన్, తదితరులు పాల్గొన్నారు.

BC Commission Chairman
BC Commission Chairman

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *