- పోత్గల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ
- ముస్తాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో పరిశీలన
Collector Sandeep Kumar Jha: రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి, మార్చి 27 (మన బలగం): మిషన్ భగీరథ నీటి సరఫరాలో ఇబ్బందులు రాకుండా చూడాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. ముస్తాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో కలెక్టర్ గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. ముందుగా చిప్పలపల్లి గ్రామంలో మిషన్ భగీరథ అధికారులతో కలిసి పరిశీలించారు. గ్రామంలో నీటి సరఫరాపై అధికారులను ఆరా తీశారు. డిమాండ్ ఎంత? సరఫరా ఎంత? అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ముస్తాబాద్ మండల కేంద్రంలోని డబుల్ బెడ్ రూం ప్రాంతం, ఎస్సీ కాలనీలో పర్యటించి, నీటి సరఫరా పై వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఈ వేసవిలో ఎక్కడా తాగు నీటి సమస్య రాకుండా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. దీనికి కావాల్సిన సామాగ్రిని సేకరించాలని, అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి
విద్యాలయం ఆవరణ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. ముస్తాబాద్ మండలం నామాపూర్ లోని మోడల్ స్కూల్లో ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు పరిశీలించారు. అనంతరం హాస్టల్లో కిచెన్ గది, స్టోర్ రూమ్, సామగ్రిని తనిఖీ చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు.
వైద్య సేవలు ఎలా ఉన్నాయి?
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు ఎలా అందుతున్నాయని పలువురు పేషెంట్లను కలెక్టర్ ఆరా తీశారు. ముస్తాబాద్ మండలం పోత్గల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ఓపీ, సిబ్బంది రిజిస్టర్, ల్యాబ్, మందులు పంపిణీ చేసి గది, ఇన్పేషెంట్ వార్డ్, వ్యాక్సిన్ గదిని పరిశీలించారు. ప్రభుత్వ ఆసుపత్రుల వైద్య సేవలపై అందరికీ అవగాహన కల్పించాలని సూచించారు. సర్కార్ ఆసుపత్రిల్లోనే ఎక్కువ సంఖ్యలో డెలివరీలు అయ్యేలా చూడాలని ఆదేశించారు. ఇక్కడి పిహెచ్కి కావాల్సిన వైద్యులు, సిబ్బందిని త్వరలో నియమిస్తామని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో మిషన్ భగీరథ అధికారులు జానకి, ప్రేమ్ కుమార్, రాము, ఎంపీడీవో బీరయ్య, డాక్టర్ గీతాంజలి తదితరులు పాల్గొన్నారు.
