kidnap
kidnap

kidnap: హరీశ్ కుమార్ కిడ్నాప్‌‌లో షాకింగ్ విషయాలు వెలుగులోకి..

  • డ్రైవర్ సహా ఆరుగురు నిందితుల అరెస్టు
  • వివరాలు వెల్లడించిన నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల

kidnap: నిర్మల్, జూన్ 20 (మన బలగం): నిర్మల్ జిల్లా మామడ పోలీస్ స్టేషన్ పరిధిలోని పొనకల్ గ్రామంలో చోటు చేసుకున్న కిడ్నాప్, హత్యాయత్నం, దొంగతనం కేసును నిర్మల్ పోలీసులు వేగంగా ఛేదించారు. బాధితుడు చిక్యాల హరీశ్ కుమార్ (హరీశ్ రావు) మాజీ డీసీసీబీ చైర్మన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి, హత్యాయత్నానికి ప్రయత్నించి, బెదిరించి నగదు డిమాండ్ చేయడమే కాకుండా ఇంట్లోకి చొరబడి బంగారం, నగదును మరియు వాహనాన్ని దొంగలించిన కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల కిడ్నాప్ కేసు వివరాలను వెల్లడించారు.

డ్రైవరే కిడ్నాపర్
నిర్మల్ జిల్లా మామడ మండలం పొన్కల్ గ్రామానికి చెందిన మాజీ డీసీసీబీ చైర్మన్ హరీశ్ కుమార్ కిడ్నాప్ వ్యవహారంలో ఆయన వద్ద పనిచేసిన డ్రైవరే ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ప్రధాన నిందితుడు షేక్ హైదర్‌ది పొన్కల్ గ్రామం. గతంలో ఇతను బాధితుడైన చిక్యాల హరీశ్ రావు వద్ద డ్రైవర్‌‌గా పనిచేసాడు. ఇతని ప్రవర్తన నచ్చక 6 నెలలకే పనిలో నుంచి తీసివేసారు. దీనితో షేక్ హైదర్ పగ పెంచుకున్నాడు. అతను తన మిత్రుడు బానాల ప్రిన్స్‌తో కలిసి కిడ్నాప్ వ్యవహారానికి ఒడిగట్టాడు. గుంటూరుకు చెందిన బానాల ప్రిన్స్, విజయవాడకు చెంది తట్టురి రవి, కళకంటి సురేశ్, గూడె కోటేశ్వర రావుతోపాటు పొన్కల్‌కు చెందిన మధుసూదన్ కలిసి పథకం ప్రకారం హరీశ్ రావును కిడ్నాప్ చేశారు. కిడ్నాప్‌కు అవసరమైన కత్తులు, తాళ్లు, మాస్కులు, ప్లాస్టర్లు ముందుగానే సిద్ధం చేసుకున్నారు.

పక్కా స్కెచ్ వేసి కిడ్నాప్
కిడ్నాప్‌కు ముందు నిందితులకు మధుసూదన్ అనే వ్యక్తి హరీశ్ రావు రాకపోకల వివరాలు తెలియజేస్తూ సహకరించాడు. దీని కోసం రెండు సార్లు రెక్కి నిర్వహించారు. కిడ్నాప్ కోసం నిందితులు పటాన్ చెరువులో లాంగ్ డ్రైవ్ కోసం అని ఒక షిఫ్ట్ కార్ అద్దెకు తీసుకున్నారు. దానిలో అందరూ పొనకల్‌కు చేరుకున్నారు. 15 అర్ధరాత్రి సుమారుగా 1:45 గంటలకు, నిందితులు పొనకల్ గ్రామంలోని బాధితుడి ఇంటి పైకప్పు ద్వారా లోపల ప్రవేశించి, అతని చేతులు కాళ్లు కట్టి, నోరుమూసి బెదిరించారు. బంగారు చైన్, రెండు బంగారు బిళ్లలు, డైమండ్ ఉంగరం, రూ.ఐదు వేల నగదును దొంగలించారు. అనంతరం బాధితుడిని అతని ఇన్నోవా కారులో కిడ్నాప్ చేసి హైదరాబాద్ వైపు తరలించారు. కారులో నిందితులు బాధితుడిని కత్తులతో బెదిరిస్తూ, అతని బంధువులకు ఫోన్లు చేయించి రూ.3 కోట్లు డిమాండ్ చేశారు. మనోహరాబాద్ టోల్ ప్లాజా వద్ద కార్ ఫాస్ట్ ట్యాగ్ స్కాన్ కాకపోవడంతో కారును ఆపాల్సి వచ్చింది. అదే సమయంలో బాధితుడు కట్లు విడిపించుకొని నిందితులను తోసి కారులో నుంచి బయటికి దూకి పరారయ్యాడు. దొరికిపోతామన్న భయంతో నిందితులు బాధితుని కారును టోల్ ప్లాజాకు కొద్ది దూరంలో వదిలేసి, వారు కిరాయికి తెచ్చుకున్న మరొక కారులో దోచుకున్న సొత్తుతో పరారయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల స్పందించి కేసును ఛేదించడం కోసం ప్రత్యేక శ్రద్ధ కనబరచారు. ఏఎస్పీ నిర్మల్ రాజేశ్ మీన నేతృత్వంలో ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సాంకేతిక పరిజ్ఞాన సహాయంతో చాక చక్యంగా నాలుగు రోజుల్లోనే నిందుతులను పట్టుకున్నారు.

మూడ్రోజుల్లో కేసు ఛేదన

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. ఈ కిడ్నాప్ రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. కిడ్నాప్‌ను కేవలం మూడు రోజుల్లో ఛేదించి నిందితులను పట్టుకోవటం జరిగింది. జిల్లా పోలీసులు ప్రజల రక్షణ కోసం కట్టుబడి ఉన్నారు. ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలుంటే పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. నిర్మల్ జిల్లా పోలీస్ శాఖ ప్రజలకు న్యాయం చేస్తూ నేరాలపై కఠినంగా వ్యవహరిస్తుంది. ప్రజల సహకారం ఎంతో అవసరం. ఏవైనా అనుమానాస్పద చట్టవిరుద్ధ కార్యకలాపాలుంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. కేసు ఛేదనలో ఏఎస్పీ నిర్మల్ రాజేశ్ మీన, ఇన్‌స్పెక్టర్లు గోవర్ధన్ రెడ్డి, కృష్ణ, సమ్మయ్య, ఎస్ఐలు ప్రదీప్, శ్రీనివాస్, లింబాద్రి, శ్రీకాంత్, అశోక్, హెడ్ కానిస్టేబుల్ తాహేర్ ఖాన్, కానిస్టేబుల్స్ రాజేందర్, ముత్యం, సంతోష్, రాజు, సాయి కృష్ణ, ప్రవీణ్ దయాకర్, రమేష్, రాజ్ కుమార్, హోమ్ గార్డులు తక్కన్న, తిరుపతి, రమణల టీం చాకచక్యంగా పని చేశాయి. వీరిని జిల్లా ఎస్పీ జానకి షర్మిల ప్రత్యేకంగా అభినందించారు.

kidnap
kidnap

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *