Maaneru Riverfront: సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ శాసనసభ్యులు చాడ వెంకటరెడ్డి బుధవారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. కరీంనగర్ నగరంలోని మానేరు రివర్ ఫ్రంట్ పనులలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై, సంబంధిత గుత్తేదారుపై గత పాలకుల పాత్రపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని కోరుతూ విజ్ఞప్తి చేశారు. మానేరు రివర్ ఫ్రంట్ అభివృద్ధికి గత ప్రభుత్వం రూ.500 కోట్లు మంజూరు చేసిందని పేర్కొన్నారు. ఇందులో టూరిజం శాఖ, నీటిపారుదల శాఖలకు రూ.100 కోట్ల చొప్పున విడుదల చేశారని వివరించారు. గత ప్రభుత్వం హయాంలో కొనసాగిన ఈ పనులను వారి అనుచరులకు అప్పగించారని తెలిపారు. కాంట్రాక్టర్ నాణ్యత ప్రమాణాలు పాటించకుండా నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు. పనులు పూర్తికాకుండానే బిల్లులు మంజూరు చేశారని వెల్లడించారు. నిర్మాణ పనుల్లో అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని పేర్కొన్నారు. భారీ వర్షాలకు చెక్డ్యాములు కొట్టుకుపోయాయని, అయినా రివర్ ఫ్రంట్ పనులకు నిధులు విడుదల చేశారని తెలిపారు. ఐదేళ్లు గడుస్తున్నా పనులు పూర్తి కావడంలేదన్నారు. మానేరు రివర్ ఫ్రంట్ పనుల్లో జరిగిన అవినీతి, అక్రమాలపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని సీఎంను కోరారు.