Reopening of schools : నిర్మల్ పట్టణంలోని సోమవారపేట్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో గురువారం నూతన విద్యా సంవత్సర ప్రారంభ సందర్భంగా విద్యార్థినులకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు గులాబీ పూలను ఇచ్చి స్వాగతం పలికారు. నూతన విద్యా సంవత్సర ఆరంభాన్ని పురస్కరించుకొని పాఠశాలను ఈరోజు మామిడి తోరణాలతో, అరటి, కొబ్బరి ఆకులతో అందంగా అలంకరించారు. విద్యార్థులకు స్వాగతం పలుకుతూ మైదానంలో రంగవల్లులను తీర్చిదిద్దారు. పాఠశాలలోని తరగతి గదులను, వరండాలను, సమావేశ వేదికను త్రివర్ణ బెలూన్లతో అలంకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ముడారపు పరమేశ్వర్ మాట్లాడుతూ.. విద్యార్థినులు ప్రతిరోజూ క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరు కావాలని కోరారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్చాలని అభ్యర్థించారు. ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలను, యూనిఫామ్లను అందజేస్తున్నదని తెలిపారు.
ఉదయం విద్యార్థులకు రాగిజావతో పాటు మధ్యాహ్నం శూచి, రుచికరమైన భోజనాన్ని ఇస్తున్నట్లు తెలిపారు. తల్లిదండ్రుల ఆకాంక్షల మేరకు పాఠశాలలో కంప్యూటర్ ఆధారిత కృత్రిమ మేధ విద్య బోధన చేస్తున్నట్లు వివరించారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు బోధన గావించబడుచున్నదని, విద్యార్థులు పాఠ్యరంగాలతోపాటు సహ పాఠ్య కార్యకలాపాలలో రాణించేలా వారిని తీర్చిదిద్దుతున్నట్లు వెల్లడించారు. పాఠశాలల్లో విద్యార్థుల మానసిక, ఆరోగ్య, శారీరక పెంపుదలకు యోగా, క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వీటన్నిటిని తల్లిదండ్రులు వినియోగించుకోవాలని, అందుకు తమ బడిఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్చాలని కోరారు. ప్రైవేటు పాఠశాలపై మోజును వీడాలని, ఆర్థికగా భారాన్ని తగ్గించుకోవడానికి, ప్రభుత్వ పాఠశాలలను ఎన్నుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను, నోటు పుస్తకాలను అందజేశారు. కార్యక్రమాలలో పాఠశాల ఉపాధ్యాయులు జాఫర్, మనోహర్ రెడ్డి, లక్ష్మణ్, ఉజ్మా, శకుంతల, నివేదితలతోపాటు పోషకులు, స్థానిక ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.