- పాలకులు మారుతున్నా మారని ప్రజల బతుకులు
- సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మర్రి వెంకటస్వామి
Telangana State Formation Day: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సీపీఐ అనేక పోరాటాలు నిర్వహించి రాష్ట్ర సాధనలో క్రియాశీలక పాత్ర పోషించిందని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మర్రి వెంకటస్వామి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం సీపీఐ కరీంనగర్ జిల్లా సమితి కార్యాలయం బద్దం ఎల్లారెడ్డి భవన్ వద్ద ఏర్పాటు చేసిన జాతీయ జెండాను ముఖ్యఅతిథిగా విచ్చేసిన మర్రి వెంకటస్వామి ఎగురవేశారు. ఈ సందర్భంగా వెంకటస్వామి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతానికి తీరని అన్యాయం జరుగుతుందని, ఆంధ్ర పాలకులు తెలంగాణ సంపదను దోచుకు తింటున్నారని, నీళ్లు, నిధులు, నియామకాల కోసం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన డిమాండ్ను బలంగా వినిపిస్తూ, రాష్ట్ర సాధన కోసం కులమతాలకతీతంగా ఉద్యమంలో పాలుపంచుకున్నారని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను చైతన్యవంతం చేసి రాష్ట్రం సాధించేవరకు భారత కమ్యూనిస్టు పార్టీ అచంచలమైన మిలిటెంట్ పోరాటాలు నిర్వహించిందని గుర్తుచేశారు. ఏ లక్ష్యం కోసం అయితే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామో ఆ లక్ష్యం నెరవేరలేదని, తెలంగాణ వచ్చిన తర్వాత స్వరాష్ట్ర పాలకులు నీళ్లు, నిధులు, నియామకాల విషయములో చిత్తశుద్ధి కనపరచలేదని మండిపడ్డారు. పాలకులు మారినా ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని, ప్రజల బతుకులు మారలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేటికీ అర్హులైన పేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు, దున్నేవానికి భూమి లేకుండా పోయిందని, నిరుద్యోగ సమస్య ఇంకా కొట్టుమిట్టాడుతుందని అన్నారు.
పాలకులు అనేక వాగ్దానాలు చేస్తున్నప్పటికీ వాటిని అమలుపరచడం లేదని, ప్రజల సమస్యలు పరిష్కరించడం లేదని రానున్న రోజుల్లో నీళ్ల కోసం నిధుల కోసం నియామకాల కోసం సీపీఐ ఆధ్వర్యంలో మరో పోరాటానికి సిద్ధం కాక తప్పదని పాలకులను వెంకటస్వామి హెచ్చరించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో గల్లి నుంచి ఢిల్లీ వరకు ఒకే మాటపై ఉన్న జాతీయ పార్టీ సీపీఐ అని, ప్రత్యేక తెలంగాణ ఇవ్వాల్సిందేనని గట్టిగా పోరాటం నిర్వహించింది ఒక్క సీపీఐ పార్టీయే అని వెల్లడించారు. ఎందరో అమరవీరుల ప్రాణ త్యాగాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిపాలకులు రాష్ట్ర ప్రజల ఆశయాలు, లక్ష్యాలు నెరవేర్చ లేదని రానున్న రోజుల్లో ప్రజల హక్కుల కోసం పోరాటాలు నిర్వహించాలని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, జిల్లా కార్యవర్గ సభ్యులు అందె స్వామి, కసిరెడ్డి సురేందర్ రెడ్డి, నాగెల్లి లక్ష్మారెడ్డి, పిట్టల సమ్మయ్య, కిన్నెర మల్లవ్వ, జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు, కటికరెడ్డి బుచ్చన్న యాదవ్, కంది రవీందర్ రెడ్డి, అందె చిన్న స్వామి, బ్రామండ్ల పెల్లి యుగేందర్, మచ్చ రమేష్, బూడిద సదాశివ, మావురపు రాజు, కొట్టే అంజలి, పార్టీ, ప్రజా సంఘాల నాయకులు చెంచల మురళి, మామిడిపెల్లి హేమంత్ కుమార్, ఓర్సు కొమురయ్య, నర్సింహులు, కడారి బీరయ్య, జక్కుల రాజయ్య, మామిడిపెల్లి శంకరయ్య, కూన రవి, నగునూరి రమేష్, నల్లగొండ శ్రీనివాస్, నాయిని సురేష్, సందీప్ రెడ్డి, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.