supplementary exams: పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు మంగళవారం నుంచి మొదలవుతున్నాయని నిర్మల్ జిల్లా ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ ముడారపు పరమేశ్వర్ తెలిపారు. జిల్లాలో 312 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ విద్యార్థులందరూ నిర్మల్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల సోమవార్పేట్లో పరీక్ష రాస్తారని తెలియజేశారు. పరీక్ష నిర్వహణ కోసం చీఫ్ సూపరింటెండెంట్ను, డిపార్ట్మెంట్ అధికారులు, సిట్టింగ్ స్క్వాడ్తోపాటు ఇన్విజిలేటర్లను నియమించినట్లు వివరించారు. పరీక్షలు సీసీ కెమెరా పర్యవేక్షణలో జరగనున్నాయని తెలిపారు. విద్యార్థులు ప్రతిరోజూ అరగంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. ఐదు నిమిషాలకు మించి ఆలస్యమైతే విద్యార్థులను పరీక్ష రాసేందుకు అనుమతించేది లేదని స్పష్టం చేశారు. విద్యార్థుల హాల్ టికెట్లు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. లేని పక్షంలో జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో హాల్ టికెట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రతిపరీక్ష కేంద్రంలో మెడికల్ సిబ్బంది, అంగన్వాడీ సిబ్బందితోపాటు పోలీస్ సిబ్బంది ఉంటారని తెలిపారు. వికలాంగుల కోసం వీల్ చైర్ను అందుబాటులో ఉంచినట్టు వెల్లడించారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న ఈ పరీక్షల కోసం నిర్మల్లో ఏకైక కేంద్రమైన ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల సోమవారపేటలో ఏర్పాట్లు అన్ని పూర్తయినట్లు వెల్లడించారు. ఈ పరీక్షలు ప్రతిరోజూ ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు నిర్వహించబడతాయని వెల్లడించారు. ఏడు రోజులపాటు జరగనున్న ఈ పరీక్ష సమయాలలో పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ను రెవెన్యూ అధికారులు అమలు చేస్తుందని, ఆ సమయంలో జిరాక్స్ సెంటర్లు మూసి ఉంటాయని తెలిపారు.