bhuvneshwar kumar: భువనేశ్వర్ కుమార్ టీం ఇండియాలో ప్రధాన బౌలర్. ఒకప్పుడు పేస్ బౌలింగ్ విభాగంలో భారత జట్టును నడిపించాడు. తన స్వింగ్ తో ప్రధాన జట్ల బ్యాట్స్ మెన్లను ముప్పు తిప్పలు పెట్టేవాడు. ఇన్ స్వింగ్, అవుట్ స్వింగ్, నకుల్ బాల్, యార్కర్లు ఇలా అన్ని రకాల వైవిధ్యమైన బంతులను వేస్తూ ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపించేవాడు.
అయితే ఈ మధ్య ఫామ్ కోల్పోవడంతో ఇబ్బంది పడాల్సి వచ్చింది. మూడు ఫార్మాట్లతో బౌలింగ్ తో అదరగొట్టిన భువినీ పక్కనపెట్టారు. జట్టుకు దూరం కాగా.. డొమెస్టిక్ క్రికెట్ లో బాగా రాణించాడు. రంజీ సీజన్ లో బౌలింగ్ బాగా చేసి మళ్లీ సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. కానీ సీనియర్ బౌలర్ కావడంతో యువకులకు అవకాశాలు ఇచ్చే విషయంలో భువిని పరిగణలోకి తీసుకోవడం లేదు.
ఈ ఐపీఎల్ లో భువీ ఇప్పటి వరకు పది మ్యాచుల్లో అంతగా ప్రభావం చూపలేకపోయాడు. కానీ రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో మాత్రం నిప్పులు చెరిగే బంతులతో మొదటి ఓవర్ లోనే జోస్ బట్లర్, సంజు శాంసన్ లను ఔట్ చేసి మ్యాచ్ ను సన్ రైజర్స్ వైపు తిప్పాడు. సంజు శాంసన్ ఔటైన బాల్ అయితే నభూతో న భవిష్యత్ అనేలా వేశాడు. సంజు వచ్చి రాగానే కుదురుకోెనీయకుండా ఇన్ స్వింగ్ గుడ్ లెంగ్త్ బాల్ తో క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ బంతికి ఫిదా కానీ క్రికెట్ ఫ్యాన్ అంటూ ఉండడు. సంజు కూడా ఆ బాల్ ను ఎలా ఆడాలో తెలియక నిశ్చేష్టుడయ్యాడు.
చివరి ఓవర్ లో 13 పరుగులు చేస్తే రాజస్థాన్ గెలిచేదే. కానీ భువీ తన ఎక్స్ పీరియన్స్ అంతా కూడగట్టుకుని యార్కర్లతో విరుచుకుపడ్డాడు. మొత్తం 13 పరుగులకు 11 పరుగులే ఇచ్చి చివరి బంతికి రావ్ మెన్ పావెల్ ను అవుట్ చేసి సన్ రైజర్స్ ను గెలిపించాడు. మొత్తం మీద భువీ ఫామ్ లోకి రావడం ఆనందించే విషయమే అయినా ఈ సీరిస్ లో ఇదే విధంగా పర్ఫా మెన్స్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.