MLC elections: నిర్మల్, ఫిబ్రవరి 1 (మన బలగం): రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సి.సుదర్శన్ రెడ్డి, రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రధాన అధికారి మాట్లాడుతూ, ఈ నెల 27వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించనున్న జిల్లాలలో పటిష్ట చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పోలింగ్ ప్రక్రియలో భాగంగా ఈనెల 3 తేదీ నుంచి నోటిఫికేషన్ అమలులోకి వస్తుందని తెలిపారు. 10వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, 11న నామినేషన్ల పరిశీలన, 13వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ, 27 న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మార్చి 3 వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ముగిసే వరకు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని. ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరం నుంచి కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ, జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలాన్నారు. అధికారులు అంతా సమన్వయంతో పనిచేసి ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలన్నారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ఆర్టీవో రత్నకళ్యాణి, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు శ్రీనివాస్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.