Collector Sandeep Kumar Jha: రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి 19 (మన బలగం): సిరిసిల్ల పట్టణం పచ్చదనంతోపాట స్వచ్ఛంగా ఉండాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. సిరిసిల్ల పట్టణంలోని కొత్త చెరువు, పాత బస్టాండ్, సంజీవయ్య నగర్, పద్మ నగర్, వెంకంపేట, కార్గిల్ లేక్, కొత్త బస్టాండ్, రైతు బజార్, బైపాస్ రహదారులు, బతుకమ్మ ఘాట్ను క్షేత్ర స్థాయిలో బుధవారం తనిఖీ చేశారు. సిరిసిల్ల ప్రధాన రహదారి మధ్యలోని డివైడర్కు కావాల్సిన మరమ్మతులు, మొక్కల పెంపకం చేపట్టాలని సూచించారు. స్పెషల్ డ్రైవ్ చేపట్టి అన్ని ప్రధాన రహదారులు నిత్యం శుభ్రం చేయించాలని, కొత్త చెరువు పరిసరాలు శుభ్రం చేయించాలని, విద్యుత్, నీటి సరఫరా పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, చెరువు వద్ద ఉన్న దుకాణాలను పరిశీలించాలని, కొత్త చెరువులోకి, ఇక్కడి నుంచి వరద నీరు వెళ్లేందుకు పనుల ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా సంజీవయ్య జంక్షన్ అభివృద్ధికి డీపీఆర్ తయారు చేయాలని, పట్టణంలో ఏర్పాటు చేసిన హోర్డింగ్స్ అడ్వర్టైజ్మెంట్ పన్ను చెల్లించారా లేదా అని పరిశీలించాలని ఆదేశించారు. పన్ను చెల్లించకుండా ఆయా ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన వాటిని తొలగించాలని, పట్టణంలోని అన్ని మురుగు కాలువలు శుభ్రం చేయించాలని, కార్గిల్ లేక్ పరిసరాలు శుభ్రం చేయించాలని, లేక్కు కావాల్సిన మరమ్మతులు వెంటనే చేపట్టాలని, అందంగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. బతుకమ్మ ఘాట్ వద్ద ఉన్న షటర్లు అద్దెకు ఇచ్చేందుకు వేలం వేయాలని, రైతు బజార్ పరిసరాలు శుభ్రం చేయించాలని, ఆయా రోడ్లలో అనుమతి, లైసెన్స్ లేని దుకాణాలు తొలగించాలని సూచించారు. అన్ని దుకాణాల ట్రేడ్ లైసెన్స్ పరిశీలించాలని కలెక్టర్ ఆదేశించారు. రోడ్ల వెంట, ఆయా ప్రదేశాల్లో నాటిన మొక్కలు సంరక్షించాలని సూచించారు. పందుల పెంపకం దారులతో సమావేశం ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ పర్యటనలో మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, ఏఈ స్వామి, సిబ్బంది తదితరులు ఉన్నారు.