MP Gaddam Vamsi krishna: పెద్దపల్లి, జనవరి 6 (మన బలగం): పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ గురువారం కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్ధి, ప్రజల సమస్యలు, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణ వంటి అంశాలతోపాటు కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తక్కువ కేటాయింపులు, పెద్దపల్లి నియోజకవర్గానికి రావాల్సిన నిధులపై ప్రత్యేకంగా చర్చించారు. గడ్డం వంశీకృష్ణ తెలంగాణకు ప్రాముఖ్యత ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరిస్తోందని ముఖ్యంగా సింగరేణి, వ్యవసాయ రంగం, పరిశ్రమల అభివృద్ధి, రోడ్లు, రైలు ప్రాజెక్టుల కోసం అవసరమైన నిధులను తగినంతగా కేటాయించకపోవడం తీవ్రంగా బాధించిందని ప్రియాంక గాంధీ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ప్రాజెక్టులు, యువతకు ఉపాధి అవకాశాలు, విద్య, వైద్యం అభివృద్ధికి సంబంధించి ప్రత్యేక నిధుల కేటాయింపుల కోసం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రియాంక గాంధీ తెలంగాణకు అన్యాయం జరుగకుండా, రాష్ట్రానికి సరైన నిధులు రావడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పోరాడుతుందని హామీ ఇచ్చారు. ప్రజా సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని, ఈ విషయంలో పార్టీ స్థాయిలో ప్రయత్నాలు జరుగుతాయని ఆమె స్పష్టం చేశారు.