Collector Abhilash Abhinav: నిర్మల్, ఫిబ్రవరి 6 (మన బలగం): సోన్ మండలం కడ్తాల్ గ్రామ సమీపంలోని జాతీయ రహదారి ‘వై’ జంక్షన్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా సోన్ మండలం కడ్తాల్ గ్రామ ప్రజలు ఇబ్బందులు పడుతున్నందున జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సంబంధిత అధికారులు, కడ్తాల్ గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కడ్తాల్ జాతీయ రహదారి ‘వై’ జంక్షన్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రహదారిపై తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో, వారి సమస్యను పరిష్కరించేందుకు సంబంధిత అధికారులందరితో ఇప్పటికే సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ఆర్డీవో అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కమిటీ ఇప్పటికే సమస్యాత్మక ప్రదేశానికి వెళ్లి వాహనాల రాకపోకలకు ఎదురవుతున్న ఇబ్బందులను పరిశీలించిందన్నారు.
రహదారి సమస్యను శాశ్వతంగా పరిష్కరించడంతోపాటు, శాశ్వత పరిష్కారం పూర్తయ్యేలోపు తాత్కాలికంగా ప్రమాదాలను నివారించేందుకు వెంటనే తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రహదారి సమస్య పరిష్కారంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో జాతీయ రహదారి ఇంజనీరింగ్ అధికారులతో వివరాలను తెలుసుకున్నారు. సమస్య శాశ్వత పరిష్కారానికి పూర్తి వివరాలతో ప్రాజెక్టు రిపోర్టును సిద్ధం చేయాలన్నారు. కడ్తాల్ గ్రామం నుంచి నిర్మల్ వైపుకు వాహనాలు మళ్లే దారిలో తాత్కాలిక రహదారి విభాగినులను ఏర్పాటు చేసి, భారీ వాహనాలు మళ్లుతాయో లేదో తెలుసుకునేందుకు పరిశీలనాత్మకంగా అధికారులు, గ్రామస్తుల సమక్షంలో ఆర్టీసీ బస్సులను తిప్పి చూడాలన్నారు. వీలైనంత త్వరగా గ్రామస్తుల సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. గ్రామస్తుల నుంచి సమస్య పరిష్కారానికి సూచనలను తీసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిళ, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, అదనపు ఎస్పీలు రాజేశ్ మీనా, ఉపేంద్రా రెడ్డి, ఆర్డీవో రత్నకళ్యాణి, ఆర్అండ్బీ ఈఈ అశోక్ కుమార్, జాతీయ రహదారుల అధికారి ప్రసన్న, ఆర్టీవో దుర్గప్రసాద్, సోన్ మండల తహసిల్దార్ మల్లేశ్, ఎంపీడీవో సురేశ్, కడ్తాల్ గ్రామస్తులు, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.