birthday celebrations: నిర్మల్, ఫిబ్రవరి 6 (మన బలగం): నేరడిగొండ మండలం ధార్మిక్ నగర్ గ్రామంలో గురువారం అధ్యాపకుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన అభిమానులు ప్రతి సంవత్సరం లాగానే ఈరోజు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో 58 మంది రక్త దానం చేశారు. జన్మదిన వేడుకలకు ముఖ్యఅతిథిగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు పతంగే బ్రహ్మానందం హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రక్తదానం అన్ని దానాలలో కంటే గొప్పదని, బలరాం సార్ అభిమానులు ఐదు సంవత్సరాల నుంచి ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా గొప్ప విషయమని కొనియాడారు. బలరాం జాదవ్ మాట్లాడుతూ తన పైన ఇంత భారీ ఎత్తున అభిమానాన్ని చాటుతూ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతాలలో రక్తహీనతతో బాధపడే నిరుపేద కుటుంబాలకు, అత్యవసర పరిస్థితిలో అవసరమైన వారికి ఉపయోగపడే విధంగా రక్తదానాన్ని ఇవ్వడం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేయాలని కోరారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన వారికి సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం కేక్ కట్ చేసి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో బోథ్ నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన కార్యకర్తలు, బలరామ్ అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు.
