World Cancer Day
World Cancer Day

World Cancer Day: క్యాన్సర్‌పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి: జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్

World Cancer Day: నిర్మల్, ఫిబ్రవరి 4 (మన బలగం): క్యాన్సర్ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. మంగళవారం సోన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని జరుపుకుంటామని, దీని ప్రధాన ఉద్దేశ్యం క్యాన్సర్ గురించి అవగాహన పెంచడం, నివారణ చర్యలను ప్రోత్సహించడం, ఈ వ్యాధితో పోరాడుతున్న వారిని ప్రోత్సహించడం అని తెలిపారు. మారుతున్న జీవనశైలి కారణంగా సమాజంలో క్యాన్సర్ వ్యాధి తీవ్ర రూపం దాలుస్తుందన్నారు. ప్రజల నిత్య జీవన విధానంలో ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించడం మెరుగైన ఆరోగ్య అలవాట్లను పెంపొందించుకోవడం వల్ల క్యాన్సర్ వ్యాధి రాకుండా ఉంటుందన్నారు. నిరంతర వ్యాయామం, చక్కని ఆరోగ్య అలవాట్లను పాటించడం ద్వారా క్యాన్సర్‌కు దూరంగా ఉండవచ్చు అన్నారు. ముందస్తు వ్యాధి నిర్ధారణ పరీక్షల ద్వారా క్యాన్సర్ వ్యాధిని నయం చేసుకోవచ్చు తెలిపారు.

క్యాన్సర్ వ్యాధికి ప్రభుత్వ ఆసుపత్రులలో మందులు అందుబాటులో ఉన్నాయని సరైన చికిత్స ద్వారా క్యాన్సర్‌ను నయం చేసుకోవచ్చన్నారు. ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం అనేక ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్‌లు, ఆరోగ్య సంరక్షణ పథకాలు ప్రవేశపెట్టిందని, ప్రజలు వీటిని ఉపయోగించుకుని ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలి సూచించారు. అనంతరం ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి అందిస్తున్న చికిత్సలకు కలెక్టర్ వైద్యులను అడిగి తెలుసుకున్నారు. చికిత్సల కోసం ఆరోగ్య కేంద్రానికి వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఆస్పత్రికి సంబంధించిన ప్రతి రిజిస్టర్‌ను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. రోగనిర్ధారణ గది, మందుల గది, బయటి రోగుల, లోపలి రోగుల విభాగాలను తనిఖీ చేశారు. ఆసుపత్రి ఆవరణలో మెరుగైన పారిశుధ్యాన్ని నిర్వహించాలని, వైద్యులందరూ రోగుల పట్ల సేవా దృక్పథంతో ఉండి చికిత్సలు అందించాలని సూచించారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ విధులు నిర్వహించాలని ఆదేశించారు. అంతకుముందు క్యాన్సర్ వ్యాధి వ్యాప్తి, నివారణ, చికిత్సలు తదితర అంశాలపై వైద్యులు వివరించారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి రాధిక, వైద్యులు శ్రీనివాస్, తహసీల్దార్ మల్లేశ్, ఎంపిడిఓ సురేశ్, ఆసుపత్రి సిబ్బంది, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *