Baddam Ellareddy Vardhanti: కరీంనగర్, డిసెంబర్ 27 (మన బలగం): హైదరాబాద్ సంస్థానాన్ని పరిపాలిస్తున్న నిజాం నవాబును, ఆయన తాబేదారులైన రజాకార్లను, దేశ్ ముఖ్లను ఎదిరించడానికి ఈ ప్రాంతంలో వెట్టి చాకిరి, బానిసత్వం, దోపిడీకి వ్యతిరేకంగా దున్నే వానికి భూమి కావాలని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చిన గొప్ప యోధుడు, పోరాట సేనాని బద్దం ఎల్లారెడ్డి అని సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి అన్నారు. శుక్రవారం బద్దం ఎల్లారెడ్డి 45వ వర్ధంతిని పురస్కరించుకొని కోతి రాంపూర్ బైపాస్ రోడ్డులో గల ఎల్లారెడ్డి విగ్రహానికి వెంకటస్వామి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వెంకటస్వామి మాట్లాడుతూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం గాలిపెల్లి గ్రామంలో జన్మించిన బద్దం ఎల్లారెడ్డి దేశ స్వాతంత్ర్యం కోసం మహాత్మా గాంధీ చేస్తున్న సత్యాగ్రహానికి ఆకర్షితుడై స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొని జైలుకెళ్లాడని తెలిపారు. ఆనాటి కమ్యూనిస్టు పార్టీ అగ్ర నాయకులు రావి నారాయణరెడ్డి, మగ్ధుం మోహియుద్దిన్ లాంటి వారితో కలిసి ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టు పార్టీలో కీలకం నేతలుగా పనిచేశారని వివరించారు. హైదరాబాద్ సంస్థానంలో నిజాం నవాబుల అరాచకాలను ఎదిరించడానికి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చాడని తెలిపారు.
వారి పిలుపునందుకొని కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో వేలాదిమంది చైతన్యవంతులై రజాకారులకు, దేశముఖ్లకు వ్యతిరేకంగా వీరోచితంగా సాగిన పోరాటంలో 4500 మంది అమరత్వం పొందారని, పది లక్షల ఎకరాల ప్రభుత్వ భూమిని పేదలకు పంచిన నాయకుల్లో బద్దం ఎల్లారెడ్డి అగ్ర భాగాన నిలిచాడని వెల్లడించారు. భారతదేశంలో తొలిసారి జరిగిన సాధారణ ఎన్నికల్లో కరీంనగర్ మొట్టమొదటి పార్లమెంటు సభ్యులుగా బద్దం ఎల్లారెడ్డి ఎన్నికయ్యారని, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇందుర్తి, బుగ్గారం శాసనసభ్యులుగా పని చేశారని, రాజ్యసభ సభ్యులుగా సైతం పనిచేసి ఉమ్మడి జిల్లా అభివృద్ధికి ఎంతో కృషి చేసిన గొప్ప నాయకుడని తెలిపారు. అలాంటి నాయకుడి ఆశయాలను, లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లేందుకు నేటితరం సీపీఐ శ్రేణులు కృషి చేయాలని వెంకటస్వామి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బోయిని అశోక్, టేకుమల్ల సమ్మయ్య, ఏ.ఐ.ఎస్.ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపెల్లి రాజు, బామండ్లపెల్లి యుగేందర్, బూడిద సదాశివ, నగర్ నాయకులు గామినేని సత్తయ్య, కసిరెడ్డి సందీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.