cash
cash

Cash.. Cash: డబ్బు.. డబ్బు..!  500 కరోడ్‌కా మామ్లా

  • కోరుట్లలో ఆగని రూ.500 కోట్ల ప్రకంపనలు
  • భుజాలు తడుముకుంటున్న రియల్ భూస్వాములు
  • ముల్లెలు సర్దేసుకున్న ముఖ్య లబ్ధిదారులు
  • రహస్య ప్రాంతాల్లో జల్లెడపడుతున్న ఔత్సాహికులు
  • నిజనిర్ధారణ కోసం కూపీ లాగుతూనే ఉన్న నిఘావర్గాలు

Cash.. Cash: ధనమ్ మూలమ్ ఇదమ్ జగత్.. అన్న నానుడి మరోసారి నిరూపితమైంది. వారం రోజుల క్రితం కోరుట్ల నియోజకవర్గంలోకి చేరిందంటున్న రూ.500 కోట్ల సొమ్ము వ్యవహారంపై ఇంకా ముచ్చట్లు హాట్ టాపిక్ గానే కొనసాగుతూనే ఉన్నాయి. డబ్బు ప్రకంపనలు అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ భుజాలు తడుముకునేలా చేశాయని అడ్డాల వద్ద చర్చించుకుంటున్నారు.
అయితే.. పోలీసులకు చూచాయగా అందిన సమాచారం వారికి ఆలస్యంగా అందిందని.. ఆ వచ్చిన సమాచారం మేరకు తనిఖీలు చేపట్టగా.. వ్రతం చెడినా ఫలితం దక్కలేదన్న మాటలు వినిపిస్తున్నాయి. కానీ నిఘా వర్గాలు మాత్రం నిప్పు లేనిదే పొగరాదు కదా అని చాపకింద నీరులా తమదైన శైలిలో విచారణ చేపట్టినట్టు తెలుస్తోంది.

భుజాలు తడుముకున్న రియల్ భూస్వాములు
ఆమధ్య కాలంలో (తెలంగాణ ఆవిర్భావించిన మొదటి ఆరునెలల టైం) కొందరు ఆంధ్రా ధనవంతులు అగ్గువ.. సగ్గువకు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అమ్మేసిన భూమిని కొనుక్కున్న కోరుట్ల, మెట్‌పల్లి పట్టణాలకు చెందిన రియల్ భూస్వాములకు ఇప్పటి రేట్లకు అమ్ముకుంటే వచ్చిన సొమ్ముగా కొందరు కొత్త ముచ్చటను తెరపైకి తెచ్చారు. ఇటీవలి కాలంలో హైదరాబాద్ చుట్టుపక్కల భూములకు భారీ ధరలు పలకడంతో పనిలోపనిగా అగ్గువ ధరలకు కొన్న భూములకు ఊహించని ధరలు పలికాయని.. ఆ సొమ్ము అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొన్ని కోట్లు బయానాగా ముట్టజెప్పారని, పార్లమెంటు ఎన్నికల తరువాత మిగిలిన సొమ్మును చెల్లించినట్టుగా.. ఆ సొమ్మే ఈ సొమ్ము అయి ఉంటుందని వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశమైంది.

ఒకదశలో పరస్పరం ఫోన్‌లలో ఇది నిజమేనా? ఆ భూముల పేమెంటేనాని? ఆరాతీస్తున్నట్టు వినిపిస్తోంది. అందులో 60-40 పద్ధతిలో ఈ పేమెంట్ వచ్చిందని, భాగస్వాములు పంచుకునే లోపే ఈ ప్రకంపనలు వారిని భుజాలు తడుముకునేలా చేశాయంటున్నారు. ఈ ముచ్చటెందుకిప్పుడు హాట్ టాపిక్‌గా మారిందంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఓ పార్టీ అభ్యర్థికి ఓ-రూ.5 కోట్లు సమర్పించుకోవడంతో సదరు విషయం తెలిసిన వాళ్లు ఇది అదే కావచ్చు.. ఆ టీందే అయుంటుందని ఆనోటా.. ఈనోటా చెవులు కొరుక్కుంటున్నారు.

రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చ
కోరుట్ల నియోజకవర్గంలోకి రూ.500 కోట్లు రావడమా? ఏమో నిజమే కావచ్చు? శరవేగంగా అభివృద్ధి చెందుతోన్న ఈ రెండు జంట-పట్టణాల్లో ఆ మాత్రం సొమ్ము రావడం పెద్ద ముచ్చటేం కాదంటున్నారు. దానికి కారణమేం లేకపోలేదు. రాష్ట్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషించే నాయకుల పునాదులు ఈ నియోజకవర్గంలో ఉండడమేనంటున్నారు.నిన్న-మొన్నటిదాకా అధికార పార్టీగా కొనసాగిన నేతలకు కోరుట్ల – మెట్‌పల్లిలో తమ బినామీల దగ్గర తమ సొమ్మును దాచిపెట్టుకున్నారన్న చర్చలు కూడా జరిగాయి. ఒకదశలో ఈడీ కూడా సదరు నేతల బినామీ ఆస్తులపై నిఘా పెట్టి తగు నివేదిక తెప్పించుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.
ఇప్పుడు అధికారం మాత్రమే చేతులు మారగా ఆ నేతల ఆస్తులు-వ్యాపారాలు ఆగవుగా.. ఆ క్రమంలోనే వారికి సంబంధించిన సొమ్మే అయుంటుందని తమదైన శైలిలో జనాలు ఎక్కడికక్కడే పోస్టుమార్టం చేసేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడున్న కొందరు కీలక నేతలు ఈ పాటికే ముఖ్య-లబ్ధిదారులతో తీవ్ర చర్చోపచర్చలు అనంతరం సంతృప్తికర ముల్లెలు చేరాల్సిన చోటుకి చేరవేసుకున్నట్టు అంతర్గతంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే తామెందుకు బలిపశువులం కావాలని సెర్చ్-బృందాల అధికారులు కూడా ప్రకంపనలు సృష్టించిన ఈ వ్యవహారాన్ని తూతూ మంత్రంగా ఫైల్ మూసేసినట్టుగా చర్చించుకుంటున్నారు.

సెర్చ్ బృందాల అవతారాలెత్తిన ఔత్సాహికులు
కోరుట్ల నియోజకవర్గానికి చేరిన ఆ రూ.500 కోట్ల ముల్లెలు ఎక్కడ దాచిపెట్టి ఉంటారని కొందరు ఔత్సాహికులు తామే సెర్చ్ బృందాల అవతారాలెత్తినట్టు జోరుగా చర్చించుకుంటున్నారు. కోరుట్లలో రూ.180+రూ.20కోట్లు.. జెగ్గాసాగర్ గ్రామంలోకి రూ.300 కోట్లు చేరితే.. వాటిని ఎక్కడ దాచిపెట్టి ఉంటారని కొందరు వెతకడం మొదలు పెట్టినట్టు సమాచారం. జెగ్గాసాగర్ గ్రామ శివారులో గల పశువుల కొట్టాలు.. పాడుబడిన ఇళ్లు.. గుట్ట చుట్టూ బండరాళ్లు.. తమకు తెలిసిన ఇతరత్రా రహస్య ప్రాంతాల్లో అన్వేషించినట్టు తెలిసింది. ఇక కోరుట్ల లోనైతే.. ఏసుకోనిగుట్ట, అర్బన్ కాలనీ, అల్లమయ్యగుట్ట, బీసీ కాలనీ, మాదాపూర్ కాలనీ, పాత బజార్, వీఐపీ కాలనీలంటూ తెగ వెతికినట్టు అడ్డాల వద్ద ఒడతెగని ముచ్చట్లు ఊపందుకున్నాయి. ఒకదశలోనైతే పాత ఓమినీ తెల్ల వ్యానులో యాక్సిడెంటైన ఆ వెహికల్‌లో రూ.60 కోట్లు దాచి, పైన నల్లని ప్లాస్టిక్ కవర్ కప్పి ఉంచారటన్న ముచ్చటనూ తెరపైకి తెచ్చారు.

ఆ వచ్చిన రూ.180 కోట్లను మూడు భాగాలుగా చేసి చేరాల్సిన గమ్యానికి చేర్చి జరగాల్సిన బాగోతాన్ని చోద్యం చూసినట్టుగా చూస్తున్నారని అనుభవజ్ఞులు ముచ్చటించుకుంటున్నారు. మరి అందరూ శాఖాహారులే అయితే.. మరి రొయ్యల-ముల్లెలు ఏమైనట్టంటూ కొందరు ఆశచావని ఔత్సాహికులు ఆరాతీస్తూనే ఉన్నారు. నిజమే కదా..? అంత పెద్ద సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరింటికి చేరింది? ఎటువంటి మలుపులు తిరుగుతోంది? అసలైన లబ్ధిదారులెవరు? కొసరు లబ్ధిదారులకు దొరికిందెంత ? బద్నాంఅయిన సెర్చ్ బృందాలు సాధించిందేమిటి? అసలు వారి ముసుగులో – కొసరు వారే ముల్లెలు ఎత్తుకుపోయారన్నది నిజమేనా? దీన్ని ఆధారం చేసుకుని దోచుకుని-దాచుకున్న రాజకీయులెవరు? అన్న ప్రశ్నల -ప్రకంపనలు.. జనాల్లో ఇప్పట్లో ఆగేట్టులేవు.. అంతే కదా మరి.. డబ్బెవరికి చేదు!?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *