Court order: నిర్మల్, ఫిబ్రవరి 25 (మన బలగం): నిర్మల్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కలెక్టరేట్, ఆర్డీవో కార్యాలయం స్వాధీనం చేసుకోవాలని ఆదేశిస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు నిర్మల్ సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాస్ తీర్పు వెల్లడించారు. భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించడంలో కలెక్టర్, ఆర్డీవో జాప్యం చేసిన నేపథ్యంలో నిర్మల్ కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. వివరాలిలా ఉన్నాయి. 1999లో గడ్డెన్న ప్రాజెక్టు, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయిన బాధితులకు సేకరించిన భూమికి పరిహారం చెల్లించాల్సి ఉంది. కలెక్టర్ రూ.6.79 కోట్లు, ఆర్డీవో కార్యాలయం రూ.1.45 కోట్ల పరిహారం ఇవ్వాల్సి ఉంది. కానీ నష్టపరిహారం చెల్లించాలని పలుమార్లు కోర్టు ఆదేశించినా కలెక్టర్, ఆర్డీవో జాప్యం చేశారు. ఈ నేపథ్యంలోనే బాధితులు కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో ఈ కేసును విచారించిన న్యాయస్థానం తమ ఆదేశాలను పాటించని నేపథ్యంలో కలెక్టరేట్, ఆర్డీవో కార్యాలయం స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు కలెక్టరేట్, ఆర్డీవో కార్యాలయాలకు నోటీసులు అంటించారు.