Mahashivaratri
Mahashivaratri

Mahashivaratri: దట్టమైన అడవిలో కొలువైన సాంబశివుడు

  • మహా శివరాత్రికి ముస్తాబైన ఆలయం
  • ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు
  • మూడు రోజుల పాటు కొనసాగనున్న వేడుకలు

Mahashivaratri: ధర్మపురి, ఫిబ్రవరి 24 (మన బలగం): ఎత్తైన కొండలు, చుట్టూ పచ్చదనం, పక్కనే గలగల పారే వాగు, ప్రకృతి రమణీయత మధ్య కొలువుదీరి కోరిన కోర్కెలు తీరుస్తూ భక్తులకు ఇలవేల్పుగా నిలుస్తున్నది సాంబశివుడి పుణ్యక్షేత్రం. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరెల్ల గోవిందపల్లె గ్రామాల్లో వెలిసాడు సాంబశివుడు. అటవీ ప్రాంతంలో శతాబ్ద కాలం క్రితం గుర్తించిన ధర్మపురి మండలం నేరెల్ల సాంబశివుడు శివరాత్రి సందర్భంగా బుధవారం నుంచి మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాలకు ముస్తాబయ్యారు. సాంబశివ ఆలయానికి సంబంధించి చారిత్రక ఆధారాలేవీ లేకపోయినా 30 ఏళ్ల కిందటి వరకు 3 ఫీట్ల ఎత్తు, మూడు ఫీట్ల వెడల్పయిన గూడులో స్వామివారి విగ్రహం ఉండేది. వర్షాకాలంలో నిండుగా చెట్లు కప్పుకొని పోవడంతో విగ్రహం కనిపించేది కాదు. 25 సంవత్సరాల కిందట స్థానికులు, ఇతర ప్రాంతాలకు చెందిన భక్తులు సాంబశివుడిని వెలుగులోకి తెచ్చారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్న స్వామివారిపై అత్యంత విశ్వాసంతో వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు శివరాత్రి రోజున ఇక్కడికి వచ్చి దర్శించుకుంటారు. ఓ భక్తుడు ఆలయ నిర్మాణం చేయించాడు. భక్తుల సౌకర్యం కోసం స్థానికులు వసతి మంటపాలను, రహదారి వద్ద స్వాగత తోరణాన్ని కట్టించారు.

అటవీ ప్రాంతంలో ఉన్న సాంబశివ దేవస్థానం
జాతీయ రహదారికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న సాంబశివుడి ఆలయం చుట్టూ కొండలు, పచ్చని చెట్లతో పాటు పక్కన వాగు ఉంటుంది. జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్ జిల్లాల నుంచి పాఠశాలల విద్యార్థులతో పాటు పలువురు కుటుంబసభ్యులతో ఏటా వనభోజనానికి ఇక్కడికి వస్తుంటారు. పలు ప్రాంతాలకు చెందిన అయ్యప్ప మాలాధారులు ఇక్కడే భిక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేయిస్తారు. శివ భక్తులు మహాశివరాత్రిని పురస్కరించుకొని ప్రతి ఏటా శివ దీక్షలు తీసుకుంటారు. అటవీ ప్రాంతంలో ఉండటంతో భక్తులకు, వన భోజనాలకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఆలయ కమిటీ వారు అన్నీ ఏర్పాటు చేశారు. దినదినాఅభివృద్ధి చెందుతూ అధిక సంఖ్యలో భక్తులరాకపోకలు పెరిగాయి. శివరాత్రి, మరుసటి రోజు పలు జిల్లాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు సాంబశివుడి దర్శనానికి వస్తుంటారు. శివరాత్రి మరుసటి రోజున పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని చేపడుతారు. ఈ కార్యక్రమంలో దాదాపు వేల సంఖ్యలో భక్తులు పాల్గొంటారు.

ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు
ఈ ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 26న బుధవారం మహాశివరాత్రి రోజున సుప్రభాత సేవ, వేద పారాయణం, విగ్రహమూర్తులకు పంచామృతాభిషేకం చేయనున్నారు. ఉదయం 10:30 గ్రామంలోని పలు వీధుల గుండా పల్లకీలో స్వామి అమ్మవార్ల ఎదురుకోలు నిర్వహిస్తారు. ఉదయం 11:45 శివపార్వతుల కల్యాణ మహోత్సవం ఉంటుంది. రాత్రి 12 గంటలకు లింగోద్భవ కాలంలో నిశి పూజ, బిల్వదళ పూజ, ఏకాదశ రుద్రాభిషేకం చేయనున్నారు. గురువారం ఉదయం 10 గంటలకు మృత్యుంజయ రుద్ర హవనం, రథ హోమం, రథబలి, స్వామివారి రథోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. శనివారం ఎడ్ల పండ్ల పోటీలు నిర్వహిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *