English Language Day: రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి 13 (మన బలగం): నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పేరు పొందిన స్వాతంత్ర్య సమరయోధురాలు, భారత తొలి మహిళా గవర్నర్, రచయిత్రి సరోజినీ నాయుడు 146వ జయంతిని పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గర్జనపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆంగ్ల భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు చిత్ర లేఖనం, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఆంగ్ల ఉపాధ్యాయులు సుల్తాన్ శ్రీనివాస్ను విద్యార్థులు శాలువాతో సన్మానించారు. అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రపంచంలో అత్యధిక మంది మాట్లాడే భాష ఆంగ్ల భాష అని, అమెరికా తర్వాత భారత దేశంలోనే ఎక్కువ మంది ఇంగ్లిష్ మాట్లాడుతారని తెలిపారు. ప్రాపంచిక దృక్పథాన్ని అర్థం చేసుకోవడానికి ఇంగ్లిష్ ఎంతగానో దోహదపడుతుందని, దేశంలోని సామాజిక, రాజకీయ, సాంస్కృతిక అంశాలను ప్రభావితం చేస్తుందని వెల్లడించారు. ప్రపంచంలోని ఎన్నో దేశాలతో సంబంధాలు పెంచుకోవడానికి ఉపయోగపడుతుందని వివరించారు. విద్యార్థులు ఆంగ్లంపై భయం వీడి సులువుగా నేర్చుకోవాలని కోరారు. అంతకుముందు సరోజినీ నాయుడు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ‘చిన్నారి అన్విక’ సరోజినీ నాయుడు వేషధారణలో అలరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఉమారాణి, ప్రేమ్సాగర్, బలరాం నాయక్, రవి నాయక్, విద్యార్థులు పాల్గొన్నారు.