Prajavani: నిర్మల్, జనవరి 6 (మన బలగం): ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి కలెక్టర్ దరఖాస్తులను స్వీకరించారు. రైతు రుణమాఫీ, విద్య, వైద్యం, వ్యవసాయం, పింఛన్లు, ధరణి, భూ సమస్యలు, రెండు పడక గదుల ఇండ్లు వంటి సమస్యలను పరిష్కరించాలని ప్రజలు తమ అర్జీలను సమర్పించారు. ప్రజావాణి కార్యక్రమం అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణి దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. శాఖల వారీగా ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న దరఖాస్తులు, సీఎం ప్రజావాణి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. శాఖల వారీగా ప్రజావాణి కార్యక్రమమంలో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించినప్పుడు వాటికి సంబంధించిన వివరాలను క్లుప్తంగా రిమార్కుల విభాగంలో పొందుపరచాలని ఆదేశించారు. దరఖాస్తుదారులకు పరిష్కారానికి సంబంధించిన వివరాలను అందజేయాలన్నారు. ప్రజావాణి కార్యక్రమం అనంతరం కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ, ఇప్పటివరకు జిల్లాలో 91.62 శాతం ఇందిరమ్మ ఇండ్ల సర్వే పూర్తిచేయడం జరిగిందని తెలిపారు. మిగిలిన సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా మండల స్థాయి అధికారులు ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. కేజీబీవీలను సంబంధిత అధికారులంతా ఎప్పటికప్పుడు తానికిచేస్తూ నివేదికలను అందజేయాలన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, ఆర్డీవో రత్న కళ్యాణి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
