Bandi Sanjay: మన బలగం, కరీంనగర్ బ్యూరో: ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో మెరుగైన వసతులు కల్పిస్తామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. కోనరావుపేట మండలం మరిమడ్ల, ఎల్లారెడ్డిపేట మండలం దుమాల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్తో కలిసి గురువారం పరిశీలించారు. ముందుగా ఆర్ట్ గ్యాలరీలు ప్రారంభించారు. కోనరావుపేట మండలం మరిమడ్లలోని విద్యాలయంలో రూ.16 లక్షల అంచనాతో 8 టాయిలెట్స్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయా విద్యాలయాల్లో విద్యార్థులతో మాట్లాడారు. మెనూ ప్రకారం భోజనం ఇస్తున్నారా? ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు.
టాయిలెట్స్, ప్రహరీ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం గిరిజన విద్యార్థులందరికీ కార్పొరేట్కు దీటుగా నాణ్యమైన విద్య, వసతి సౌకర్యాలు కల్పించేందుకు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ను ఏర్పాటు చేసిందని తెలిపారు. ఒక్కో విద్యార్థికి సగటున రూ.1 లక్ష 9 వేలు ఖర్చు చేస్తోందని చెప్పారు. ఇక్కడి సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆదేశించడంతోనే ఇక్కడికి వచ్చానని, సమస్యలన్నీ త్వరలోనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ప్రతి బ్లాక్ పరిధిలో 50 శాతానికంటే ఎక్కువ గిరిజన జనాభా ఉన్న ప్రాంతాల్లో ఈఎంఆర్ఎస్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఆ తరువాత 2022లో కనీసం 20 శాతం ఎస్టీ జనాభా కలిగిన ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని సంకల్పించారని తెలిపారు.
దేశవ్యాప్తంగా 728 మంజూరు చేస్తే… ప్రస్తుతం 410 స్కూల్స్లో విద్యాబోధన కొనసాగుతున్నదని వివరించారు. సగటున ఒక్కో స్కూల్లో 480 మంది విద్యార్థులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. దేశవ్యాప్తంగా 1 లక్షా 26 వేల 626 మంది విద్యార్థులు చదువుతున్నారని, తెలంగాణలో 23 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలుంటే… అందులో 8309 మంది విద్యార్థులున్నారని వెల్లడించారు. రెసిడెన్షియల్ భవన నిర్మాణం కోసం రూ.37 కోట్ల 80 లక్షలు ఖర్చు చేస్తున్నారని, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలతోపాటు ఈశాన్య రాష్ట్రాల్లోని ఏకలవ్య స్కూల్స్ భవన నిర్మాణానికి 48 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారని వివరించారు. ఈ పాఠశాలల్లో 10 శాతం సీట్లు మాత్రమే ఇతరులకు రిజర్వేషన్ కల్పిస్తారని, 90 శాతం సీట్లు ఎస్టీ విద్యార్థులకే, క్రీడల్లో ప్రతిభ కలిగిన ఎస్టీ విద్యార్థులకే స్పోర్ట్ కోటా కింద 20 శాతం సీట్లను కేటాయిస్తున్నారాని తెలిపారు.
ఆర్సీఓ జాను నాయక్, డీఈఓ రమేశ్ కుమార్, ప్రత్యేక అధికారులు లక్ష్మీరాజం, భారతి, రాందాస్, ఆర్డీవోలు రాజేశ్వర్, రమేశ్, డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, వైస్ చైర్మన్ తిరుపతి రెడ్డి, ప్రిన్సిపాల్ ఆర్ఎస్ యాదవ్, మంజిథ్, తహసీల్దార్లు రాంచంద్రం, విజయ ప్రకాశ్ రావు, ఎంపీడీవో శ్రీనివాసమూర్తి, సత్తయ్య, డీఎల్పీవో రాజు తదితరులు పాల్గొన్నారు.
మరిమడ్ల ఏకలవ్య గురుకులంలో స్వచ్ఛ ఆర్ట్ గ్యాలరీ తిలకించిన బండి సంజయ్
స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట్ మండలం మరిమడ్ల ఏకలవ్య మోడల్ స్కూల్లో స్వచ్ఛ ఆర్ట్ గ్యాలరీ ఏర్పాటు చేశారు. ఈ గ్యాలరీలో పాఠశాల విద్యార్థులు తయారుచేసిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్, ప్లాస్టిక్ బాటిల్స్ తో, పేపర్ తో తయారు చేసిన వస్తువులను ప్రదర్శించారు. విద్యార్థులచే స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించారు.స్కూలు ఆవరణలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మొక్క నాటారు. ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్, డి ఆర్ డి ఓ, డిపిఓ,డీఈఓ, తహసిల్దార్, ఎంపీడీవో, ఏపీవో, ఏపీఎం స్వచ్ఛభారత్ మిషన్ సభ్యులు పాల్గొన్నారు
