జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్
SP Jagtial: విద్యార్థులు ర్యాగింగ్కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ హెచ్చరించారు. ర్యాగింగ్ అనేద అత్యంత అమానుష చర్య అని, తోటి విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించడం, వారిని ఇబ్బందులకు గురి చేయడం మంచి విద్యార్థి లక్షణం కాదని సూచించారు. ర్యాగింగ్ చేయడం నేరమని, ఎవరైనా ర్యాగింగ్కు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యార్థులు సీనియర్స్, జూనియర్స్ అని తేడా లేకుండా స్నేహపూర్వకంగా కలిసి మెలిసి విద్యనభ్యసించాలని పేర్కొన్నారు. ర్యాగింగ్ లాంటి కేసుల్లో ఇరుక్కుంటే బంగారు భవిష్యత్తును కోల్పోతారని తెలిపారు. వ్యసనాలకు బానిసై విద్యార్థులు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని కోరారు.
సరదాలకు వెళ్లి కష్టాలను కొనితెచ్చుకోవద్దని, తల్లిదండ్రులు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని తెలిపారు. సీనియర్లు ఆదేశించినప్పటికీ, ఫ్రెషర్లు తమ ఇష్టానికి వ్యతిరేకంగా ఏదైనా చేయాలనే ఆలోచనలు మానుకోవాలని తెలిపారు. విద్యాసంస్థల యజమానులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ర్యాగింగ్, ఈవ్ టీజింగ్ చేస్తూ దోషులుగా మారొద్దని కోరారు. ర్యాగింగ్కు పాల్పడే వారి వివరాలను డయల్ 100కు తెలియజేసి పోలీసుల సహాయం పొందాలని సూచించారు. విద్యా సంవత్సరం ప్రారంభమైందని అన్ని విద్యాసంస్థల్లో యాంటీ ర్యాగింగ్ అవగాహన సదస్సులు నిర్వహించాలని తెలిపారు. యాంటీ ర్యాగింగ్ కమిటీలు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను, సిబ్బందిని ఆదేశించామన్నారు. యాజమాన్యాలు విద్యార్థుల అలవాట్లను, నడవడికను గమనిస్తూ ఉండాలని సూచించారు. ర్యాగింగ్ చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ అన్నారు.