Sri Pashupatinath Temple: ముధోల్, ఫిబ్రవరి 25 (మన బలగం): నియోజకవర్గ కేంద్రమైన ముధోల్లోని శ్రీ పశుపతినాథ్ శివలింగం ఇంటి నిర్మాణ ప్లాట్ల గుట్ట తవ్వకాల్లో 2007 ఏప్రిల్ మాసంలో 2వ తేదీన బయటపడింది. కాకతీయ కాలం నాటి ఆలయం తవ్వకాల్లో బయటపడిందని ఆలయ మహిమానిత్వమైనదని గ్రామ పెద్దలు తెలిపారు. ఆలయంలో ప్రతీ సంవత్సరం శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని రెండు రోజుల పాటు శివలింగానికి ప్రత్యేక పూజలతో పాటు జాతర నిర్వహిస్తారు. గ్రామ కమిటీ, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ జాతరకు ఆలయం విద్యుత్ దీపాలతో విరాజిల్లుతుంది. ఈ జాతరకు తెలంగాణ ప్రాంతం నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి సైతం భక్తులు తరలివస్తారు. కోరిన కోరికలు తీర్చే దైవంగా భక్తులకు నమ్మకం.
జాతరకు ఏర్పాట్లు పూర్తి
మహాశివరాత్రిని పురస్కరించుకొని శ్రీ పశుపతినాథ్ ఆలయంలో సప్తాహం నిర్వహిస్తారు. జాతరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏడు రోజులపాటు సప్తాహంలో మహారాష్ట్ర నుంచి భజనమండలి వారు హాజరై ప్రత్యేక కీర్తనలు, పారాయణం చేస్తారు. శివలింగానికి దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు రానున్నట్లు గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు.
శివపార్వతుల కళ్యాణం
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శివాలయంలో శివునికి పంచగవ్య ప్రోక్షణ, లఘున్యాస, పూర్వక ఏకాదశిని, లింగోద్భవ పూజ రుద్రాభిషేకం, అభిషేక పూజలతోపాటు సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటలలోపు శివపార్వతుల కళ్యాణం మహోత్సవం జరపడం జరుగుతుందని ఆలయ పూజారి ప్రణీత్ మహారాజ్ తెలిపారు
మహా అన్నదానం
శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు ఉపవాస దీక్షలను చేపడతారు. దీంతో ఆలయంలో శివరాత్రి మరుసటి రోజు నిర్వహించే అన్నదాన కార్యక్రమానికి మండల కేంద్రమైన ముధోల్తో పాటు బాసర, భైంసా, లోకేశ్వరం, కుంటాల, కుబీర్తో పాటు పక్క రాష్ట్రమైన మహారాష్ట్ర నుంచి భక్తులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటారు.
