Group-III: నిర్మల్, నవంబర్ 16 (మన బలగం): తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఈ నెల 17, 18వ తేదీలలో జరుగనున్న గ్రూప్-3 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. 17న ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాన్నం 12.30 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 3.00 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సెకండ్ సెషన్ పరీక్షలు జరుగుతాయని, ఆ మరుసటి రోజైన 18వ తేదీన ఉదయం సెషన్లో పరీక్ష ఉంటుందని వివరించారు. జిల్లాలో మొత్తం 8124 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నారని తెలిపారు. అభ్యర్థుల సంఖ్యకు అనుగుణంగా మొత్తం 24 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశాయని అన్నారు. కాపీయింగ్కు ఆస్కారం లేకుండా కేంద్రాలలో ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించామని, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు అనుక్షణం నిశిత పర్యవేక్షణ జరుపుతామని, సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు జరుగుతాయని కలెక్టర్ స్పష్టం చేశారు.
బయో మెట్రిక్ విధానం ద్వారా వేలిముద్రల సేకరణ ప్రక్రియ చేపట్టాల్సి ఉన్నందున అభ్యర్థులు నిర్ణీత సమయానికి ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని కలెక్టర్ సూచించారు. టీజీఎస్ ఆర్టీసీ ద్వారా ఆయా రూట్లలో పరీక్ష సమయానికి చేరుకునే విధంగా బస్సులను నడపడం జరుగుతుందని తెలిపారు. ఉదయం పరీక్షకు సంబంధించి 9.30 గంటల వరకే పరీక్షా కేంద్రం లోనికి వెళ్లేందుకు అనుమతించడం జరుగుతుందని, అనంతరం గేట్లు మూసివేస్తారని, మధ్యాహ్నం పరీక్షకు సంబంధించి 2.30 తరువాత ఎవరినీ లోనికి అనుమతించడం జరగదని స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రం లోకి మొబైల్ ఫోన్, పుస్తకాలు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు తీసుకువెళ్లేందుకు అనుమతి లేదని, ఈ మేరకు ప్రతి కేంద్రం వద్ద క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని ఆదేశించామన్నారు. పరీక్షా సమయం ప్రారంభం నుంచి ముగిసేంత వరకు పరీక్ష కేంద్రం నుంచి అభ్యర్థులతో పాటు ఇన్విజిలేటర్లు బయటకు వెళ్లకూడదని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్షలను ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా, సజావుగా జరిగేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని అన్నారు.