- రాజధానికి చేరిన ముధోల్ రాజకీయం
- నిజమైన కార్యకర్తలకు అన్యాయం చేస్తారా
- బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికి డైరెక్టర్ పదవులు ఇవ్వడం ఏంటి
- పీసీసీ అధ్యక్షునికి ఫిర్యాదు చేసిన నారాయణ్ రావ్ పటేల్ వర్గీయులు
- కాంగ్రెస్ కోసం పని చేసిన కార్యకర్తలకు మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్యాయం చేశారని ఆవేదన
Narayan Rao Patil: నిర్మల్, అక్టోబర్ 30 (మన బలగం): కష్ట కాలంలో కాంగ్రెస్ పార్టీతో ఉన్నాం. పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలో ఉండి, అధికారం పోగానే స్వలాభం కోసం మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి అసలైన కాంగ్రెస్ వాదులకు అన్యాయం చేస్తున్నారని కుభీర్ మండల కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్లో పీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ను కలిసి ఫిర్యాదు చేశారు. భైంసా మార్కెట్ కమిటీ డైరెక్టర్ల నియామకంలో అర్హులకు పదవులు ఇవ్వకుండా పదేళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీలో ఉండి, డైరెక్టర్లుగా పని చేసిన వారికి మళ్లీ పదవులు ఇచ్చారని మండిపడ్డారు. ఈ విషయంలో ఇన్చార్జి మంత్రి సీతక్కకు తప్పుడు సమాచారం ఇచ్చి తన అనుచరులకు పదవులు ఇప్పించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు మార్లు కాంగ్రెస్ పార్టీకి మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి చేసిన మోసాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంలో బలపడుతున్న తరుణంలో బీఆర్ఎస్ వారికి పదవులు ఇవ్వడంతో ప్రజల్లో తప్పుడు సంకేతం వెళ్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
విఠల్ రెడ్డిపై చర్య తీసుకొని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసినట్లు తెలిసింది. మార్కెట్ కమిటీ డైరెక్టర్ల నియామకంపై విచారణ జరిపించాలన్నారు. కుభీర్ మార్కెట్ కమిటీ పాలకవర్గం, బాసర ఆలయ కమిటీ, ఆత్మ చైర్మన్ల నియామకాల్లో కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసిన వారికి పదవులు ఇవ్వాలన్నారు. కేసీఆర్ అధికారంలోకి రావాలని అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పక్షాన ఉన్న వారు కాంగ్రెస్ వాదులు ఎట్లా అవుతారన్నారు. తమ స్వార్థం కోసం వచ్చిన వారికి గుర్తింపు ఇవ్వడం సరికాదన్నారు. మాజీ ఎమ్మెల్యే నారాయణ రావ్ పటేల్ కష్ట కాలంలో పార్టీ పక్షాన ఉన్నారని, ఆయన సూచనల మేరకు పీసీసీ అధ్యక్షున్ని కలిసినట్లు తెలిపారు. పీసీపీ అధ్యక్షున్ని కలిసిన వారిలో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్చార్జి గాడేకర్ రమేశ్, కుబీర్ మండల బీసీ సెల్ అధ్యక్షులు సిద్ధం వార్ వివేకానంద, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ బషీర్, కిసాన్ సెల్ అధ్యక్షులు జేడీ రామ్ నాయకులు శివాజీ, మల్లేశ్, తదితరులు ఉన్నారు.