Vemulawada Temple
Vemulawada Temple

Vemulawada Temple: రాజన్న కొడెల పంపిణీకి అనుమతి తప్పనిసరి: జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

  • గోశాలలో ప్రతి కోడె, ఆవు వివరాలు ప్రతి రోజూ రిపోర్ట్ చేయాలి
  • అనుమతి లేకుండా మూడో దశ పంపిణీ ఎలా జరిగింది?
  • పంపిణీ చేసిన 1975 పశువుల ప్రస్తుత స్థితిగతులపై శుక్రవారం నాటికి నివేదిక అందించాలి
  • కోడెలు, ఆవులు పంపిణీ చేసే లబ్ధిదారుల జాబితాపై కలెక్టర్ సంతకం లేనంత వరకు జాబితా ఫైనల్ కాదు
  • వేములవాడ ఆలయ గోశాల పటిష్ట నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై రివ్యూ

Vemulawada Temple: మనబలగం, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: వేములవాడ రాజన్న దేవాలయ గోశాలకు సంబంధించిన కోడెల పంపిణీకి జిల్లా కలెక్టర్ అనుమతి తప్పనిసరి అని, అనుమతి లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ గోవులను పంపిణీ చేసేందుకు వీలులేదని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను హెచ్చరించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సమీకృత జిల్లా కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో వేములవాడ ఆలయ గోశాల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ ఇక నుంచి జిల్లా కలెక్టర్ అనుమతి లేకుండా ఎట్టి పరిస్థితులలో గోశాల నుంచి కోడెలను, ఆవులను రైతులకు పంపిణీ చేసేందుకు వీలు లేదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో ఇప్పటి వరకు 1975 పశువులను గోశాల నుంచి పంపిణీ చేశామని, వీటిలో మొదటి దశలో 1278 కోడెలు, 75 ఆవులు, రెండవ దశలో 389 కోడెలు, 45 ఆవులు, మూడవ దశలో 188 కొడెలు పంపిణీ చేసామని అధికారులు వివరించారు. మొదటి, రెండు దశలకు మాత్రమే జిల్లా కలెక్టర్ అనుమతి తీసుకొని పంపిణీ చేయగా, కలెక్టర్ నుంచి ఎటువంటి అనుమతి లేకుండా మూడవ దశ పంపిణీ ఎలా జరిగిందని కలెక్టర్ అధికారులను ప్రశ్నించారు.

మూడవ దశ పంపిణీకి గల కారణాలపై సమగ్ర నివేదిక అందించాలని, దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ పేర్కొన్నారు. వచ్చే శుక్రవారం నాటికి జిల్లాలో పంపిణీ చేసిన 1975 పశువుల స్థితిగతులపై నివేదిక సమర్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పశువులను పంపిణీ చేసే సమయంలో వాటికి ట్యాగ్ ఏర్పాటు చేయాలని అన్నారు. రెవెన్యూ డివిజన్ కార్యాలయం, పోలీస్ సిబ్బంది విచారించి ఎంపిక చేసే వరకు ఏ లబ్ధిదారుడికి గోశాల నుంచి పశువులను ఇతర జిల్లాలకు పంపిణీ చేసేందుకు వీలు లేదని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రతి రోజు వేములవాడలోని 2 గోశాలలు, ఆలయ ఆవరణలో గల కోడెలు, ఆవులు ఇతర పశువుల వివరాలు తెలియ జేయాలని కలెక్టర్ తెలిపారు. కోడెలు, ఆవుల పంపిణీ చేసే లబ్ధిదారుల జాబితాపై కలెక్టర్ సంతకం లేనంత వరకు జాబితా ఫైనల్ కాదని స్పష్టం చేశారు. వేములవాడ ఆలయ అభివృద్ధి పనులకు సంబంధించి ప్రతి వారం రివ్యూ సమావేశం ఉంటుందని, నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం అభివృద్ధి పనులు జరగాలని, ఎక్కడ ఎటువంటి అవకతవకలు ఉండటానికి వీలులేదని, ఆలయానికి సంబంధించిన ప్రతి అంశం తన దృష్టికి రావాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో వేములవాడ ఆర్డిఓ రాజేశ్వర్, వేములవాడ ఆలయ ఇన్‌చార్జి ఈవో రాజేశ్, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రవీందర్ రెడ్డి, డీపీఆర్వో వి.శ్రీధర్, వేములవాడ తహసిల్దార్ మహేశ్ ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *