- ఈ నెల 1న బయలుదేరిన యాత్రికుల బస్సు
- బస్సులో 50 మంది యాత్రికులు
- బృందావన్ దర్శన సమయంలో ఘటన
- యాత్రికులను తరించేందుకు ఏర్పాట్లు
The bus caught fire: నిర్మల్, జనవరి 15 (మన బలగం): ఉత్తరప్రదేశ్లో ఘోర సంఘటన చోటు చేసుకున్నది. అక్కడ ఓ టూరిస్టు బస్సు దగ్ధమైంది. ఈ ఘటనలో నిర్మల్ జిల్లా కుభీర్ మండలం పల్సి గ్రామానికి చెందిన శీలం దుర్పతి ఎలియాస్ తిరపతి(72) సజీవ దహనమయ్యాడు. ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. భైంసా డివిజన్ పరిధిలోని పలు గ్రామాలకు చెందిన 50 మంది యాత్రికులతో టీఎస్ 12 యూఏ 6216 నెంబర్ గల టూరిస్టు బస్సు ఈ నెల 1వ తేదీన తీర్థయాత్రలకు బయలు దేరింది. వివిధ క్షేత్రాలను సందర్శిస్తూ మంగళవారం ఉత్తరప్రదేశ్లోని బృందావన్కు చేరుకుంది. సాయంత్రం బస్సులోని వారంతా బృందావన్ దర్శనానికి వెళ్లారు. దుర్పతి మాత్రం అనారోగ్యం కారణంగా బస్సులోనే ఉండి పోయాడు. యాత్రికులు దర్శనానికి వెళ్లిన కొద్దిసేపటికే బస్సుకు అనుకోకుండా మంటలు వ్యాపించాయి. ఒకేసారి మంటలు ఉధృతం కావడంతో బస్సులో ఉన్న దుర్పతి బయటికి రాలేకపోయాడు. బస్సుకు నలువైపాలా మంటలు కమ్ముకోవడంతో దుర్పతి సజీవదహనమయ్యాడు. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలు ఆర్పివేసారు. అప్పటికే బస్సులో ఉన్న దుర్పతి తీవ్రమైన కాలినగాయాలతో మృతిచెంది కనిపించాడు.
దర్శనానికి వెళ్లిన వారు తిరిగి వచ్చే సరికి అక్కడి పరిస్థితి చూసి కన్నీటి పర్యంతమయ్యారు. బస్సులో ఉన్న యాత్రికుల దుస్తులు, సామగ్రి, నగదు పూర్తిగా కాలిపోయాయి. కట్టుబట్టలతో మిగిలారు. బస్సుకు మంటలు అంటుకోవడానికి కారణం తెలియాల్సి ఉంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా బస్సు దగ్ధమై ఉండొచ్చని భావిస్తున్నారు. అక్కడి పోలీసులు యాత్రికులకు సహకారం అందించారు. వీరితోపాటు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు యాత్రికులకు కావాల్సిన ఏర్పాట్లు చేసారు. వారు ఉండడానికి బస ఏర్పాటు చేసారు. భోజనం అందించారు. బట్టలు సైతం ఇచ్చారు. వీరిని భైంసా రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ యాత్రికులను త్వరగా స్వగ్రామాలకు తరలించే చర్యలు చేపట్టారు. అక్కడి కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడారు. వీలైనంత తొందరగా వారిని సురక్షితంగా పంపాలని కోరారు. కాగా దుర్పతి వెంట ఆయన భార్య ఎల్లవ్వ సైతం యాత్రకు వెళ్లారు. ఆమె క్షేమంగా ఉన్నారు. దుర్పతికి ఇద్దరు కుమారులు ఉన్నారు. దుర్పతి వ్యవసాయ కూలీగా పనిచేసేవాడు. ఈ సంఘటనతో పల్సి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.