- బాబోయ్ బిట్ కాయిన్ -3
- తప్పించుకు తిరుగుతున్న గురువులు
- నష్టపోయిన అమాయకులు
- ఆశ చూపి మోసం చేశారు
- పెద్దలను తప్పించేందుకు ఉన్నతాధికారుల పాట్లు
- బాధితుల గోడు పట్టించుకోని అధికారులు
Bitcoin: నిర్మల్, సెప్టెంబరు 28 (మన బలగం): గురువులు దారి తప్పారు. బడిబాట పట్టాల్సిన గురువులు కాసుల వేటలో పడి బడినే మర్చిపోయారు. విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులు అదనపు ఆదాయ కోసం పక్కదారులు పట్టారు. నైతిక విలువలను మరిచిపోయి ఆదాయ మార్గాల వైపు అడుగులు వేశారు. అక్రమమో, సక్రమమో ఏదైతేనేమి ఆస్తులు సంపాదించడమే పరమావధిగా పెట్టుకున్నారు. బిట్ కాయిన్ దందాలో అడుగుపెట్టారు. ఊరూరా తిరిగారు అమాయకులకు మాయమాటలు చెప్పి బురిడీ కొట్టించారు. కోట్లాది రూపాయలు పెట్టుబడులుగా పెట్టించి కోట్లాది రూపాయల కమీషన్లు రాబట్టుకున్నారు. సార్లు స్టార్లుగా ఎదిగారు. ఫారెన్ టూర్లు వేశారు. చివరికి (బిట్ కాయిన్) గొలుసు కట్టు వ్యాపారం అక్రమమని తేలడంతో వేటుపడింది.
తప్పించుకు తిరుగుతున్న గురువులు
యు బిట్ కాయిన్ గొలుసుకట్టు వ్యాపారంలో కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టించిన ఉపాధ్యాయులు తప్పించుకు తిరగాల్సిన పరిస్థితి తలెత్తింది. నిర్మల్ జిల్లాలో సుమారు 200 కోట్ల రూపాయలను బిట్ కాయిన్ గొలుసుకట్టు వ్యాపారంలో పెట్టుబడులుగా పెట్టించిన ఉపాధ్యాయులు ఇరకాటంలో పడ్డారు. ఉపాధ్యాయులపై ఉన్న నమ్మకాన్ని సొమ్ము చేసుకున్న పంతుళ్లు పరేషాన్లో పడ్డారు. వారు చేసిన గొలుసుకట్టు వ్యాపారం ఆర్థిక నేరం కిందికి రావడంతో వారికోసం పోలీసుల వేట మొదలైంది. ఈ వ్యాపారంతో ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉన్న ఉపాధ్యాయులు తప్పించుకు తిరుగుతున్నారు. సమాజంలో ఆదర్శంగా ఉండాల్సిన ఉపాధ్యాయ లోకం అక్రమ మార్గంలో పయనించడం ఆ శాఖకు మాయని మచ్చగా తయారైంది.
నష్టపోయిన అమాయకులు
యూ బిట్ కాయిన్ వ్యాపారంలో అమాయకులే ఆర్థికంగా నష్టపోయారు. సమాజంలో గౌరవం ఉన్న ఉపాధ్యాయులు చిల్లిగవ్వ పెట్టుబడి లేకుండా కోట్ల రూపాయల కమీషన్లను రాబట్టుకున్నారు. వీరి మాటలు నమ్మిన అమాయకులు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి ఆర్థికంగా దెబ్బతిన్నారు. తమ అవసరాలకు సైతం ఖర్చు పెట్టుకోకుండా దాచుకున్న సొమ్మును ఉపాధ్యాయుల మాటలు నమ్మి పెట్టుబడులు పెట్టి ఆర్థికంగా నష్టపోయామని లబో దిబో మంటూ నెత్తి నోరు బాదుకుంటున్నారు.
ఆశ చూపి మోసం చేశారు
బిట్ కాయిన్ వ్యాపారంలో అధిక కమీషన్లు వస్తాయని ఆశ చూపి తమను మోసం చేశారని బాధితులు వాపోతున్నారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా వేలాదిమంది బ్రోకర్ల మాటలు నమ్మి పెట్టుబడులను పెట్టారు. తీరా బిట్ కాయిన్ యాప్ చట్టబద్ధమైనది కాదని తేలడంతో పెట్టబడులు పెట్టినవారు ఇబ్బందుల్లో పడ్డారు. పెట్టుబడులు పెట్టించినవారు తప్పించుకు తిరుగుతుండగా పెట్టిన వారు మాత్రం ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. తమ డబ్బులు తమకు తిరిగి ఇవ్వాలని సదరు ఏజెంట్లపై ఒత్తిడి చేస్తున్నారు. లేదంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరిస్తున్నారు.
పెద్దలను తప్పించేందుకు పాట్లు
బిట్కాయిన్ వ్యాపారంతో సంబంధాలు కలిగిన కొందరు పోలీసులకు చిక్కగా పెద్ద మొత్తంలో తప్పించుకు తిరుగుతున్నారు. వారిని ఈ వివాదం నుంచి తప్పించేందుకు విద్యాశాఖ జిల్లా ఉన్నతాధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ వ్యాపారంతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్న కొందరు జిల్లా విద్యాశాఖ అధికారికి అత్యంత సన్నిహితులు కాగా మరికొందరు పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఉన్నారు. పోలీసుల చేతికి చిక్కి కటకటాల పాలైతే సమాజంలో తమ పరువు పోతుందనే ఉద్దేశంతో తమను కాపాడాలని ఉన్నతాధికారులను కోరుతున్నారు. దీంతో వారిని రక్షించేందుకు ఉన్నతాధికారులు సైతం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
పట్టించుకోని అధికారులు
బిట్ కాయిన్ గొలుసుకట్టు వ్యాపారంతో ఉపాధ్యాయులు జిల్లా వ్యాప్తంగా ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉన్నారనే ప్రచారం జరుగుతున్న అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి సహకారంతోనే ఉపాధ్యాయులు ఈ వ్యాపారంలో భాగస్వాములు అయ్యారని ప్రచారం ఉంది. డీఈవో నిర్లక్ష్యం వల్లే విద్యాశాఖ జిల్లాలో నిర్వీర్యం అవుతుందనే ఆరోపణలు ఉన్నాయి. గతంలోనూ ఉపాధ్యాయులు ఎల్ఐసి, రియల్ ఎస్టేట్, చిట్ఫండ్ తదితర రంగాల్లో వ్యాపారాలు చేసినప్పటికీ గుట్టుచప్పుడు కాకుండా ఉండేవారు. కానీ ప్రస్తుతం జిల్లా స్థాయి అధికారుల అండదండలతో బిట్కాయిన్ గొలుసుకట్టు వ్యాపారంలో బాహటంగానే ఉపాధ్యాయులు పాలుపంచుకున్నారు. దీనంతటికీ డీఈవోనే కారణమని పలు ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి.