Shripada Rao Jayanti: నిర్మల్, మార్చి 2 (మన బలగం): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతిని ప్రభుత్వం మార్చి 2న రాష్ట్ర వేడుకగా నిర్వహించింది. ఆదివారం కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జయంతి కార్యక్రమంలో డీవైఎస్వో శ్రీకాంత్ రెడ్డి, అధికారులు దుదిల్ల శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డీవైఎస్వో మాట్లాడుతూ, స్వర్గీయ శ్రీపాద రావు సర్పంచ్గా ప్రారంభమైన తన రాజకీయ ప్రస్థానంలో ఎమ్మెల్యేగా, శాసనసభ స్పీకర్గా సేవలందించారని అన్నారు. ప్రజల మధ్య ఉంటూ, వారి కష్టాలలో పాలు పంచుకొని ప్రజానాయకుడిగా ఎదిగారన్నారు. ఈ సందర్భంగా, శ్రీపాద రావు సేవలను స్మరించుకుంటూ, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ పర్యవేక్షకులు శివరాజ్, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.